Election Commission of India | సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ.8,889 కోట్ల విలువైన డబ్బు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలు స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొత్తులో మాదక ద్రవ్యాలు 45 శాతం ఉంటాయని, వాటి విలువ రూ.3,958 కోట్లు అని పేర్కొంది.
తమ తనిఖీల్లో రూ.849.15 కోట్ల క్యాష్, రూ.814.85 కోట్ల విలువైన మద్యం, రూ.1,260.33 కోట్ల విలువ గల ఆభరణాలు, రూ.2,006.59 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నాయని ఈసీ వివరించింది. గుజరాత్ ఏటీఎస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ చేపట్టిన ఆపరేషన్లలో మూడు రోజుల్లోనే రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపింది.
అత్యధికంగా గుజరాత్లో రూ.1,461.73 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఈసీ పేర్కొంది. తర్వాతీ స్థానాల్లో రూ.1133.82 కోట్లతో రాజస్థాన్, రూ.734.54 కోట్లతో పంజాబ్ నిలిచాయి. ఇక తెలంగాణలో రూ.333.55 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.301.75 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.