దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగియగా.. ఐదో దశకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికీ ఏ పార్టీ జెండా ఎగురుతుందో, ఏ కూటమి అధికార కుర్చీపై పాగా వేస్తుందనే విషయం మాత్రం అంచనాలకు అందడం లేదు. ‘చార్ సౌ పార్’ అని గప్పాలు కొట్టిన బీజేపీ అందులో సగం సీట్లు సాధించినా అది ఆ పార్టీ గొప్పేనని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
‘చార్సౌ పార్’ అన్న బీజేపీ నినాదం.. అభూత కల్పనేనని తొలి నాలుగు విడతలతోనే స్పష్టమైంది. 2024 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచి వికసిత భారత్ అని ప్రచారం చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఊసరవెల్లి వలె రంగు మార్చింది. మళ్లీ తన పాత పద్ధతిలోనే ప్రచారాన్ని సాగిస్తున్నది. హిందూ- ముస్లిం, అయోధ్య రామ మందిరం, పాకిస్థాన్, ఆర్టికల్- 370, కశ్మీర్, బాలాకోట్.. అంటూ పాత రాగాన్నే అందుకున్నది.
మోదీ సర్కార్ పట్ల బలమైన వ్యతిరేకత ఉందా అంటే పూర్తిస్థాయిలో లేదు. వ్యతిరేకత లేనంత మాత్రాన ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తారా? అంటే అదీ చెప్పలేని పరిస్థితి. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేంత అనుకూల వాతావరణం లేదనేది సుస్పష్టం. మోదీ ప్రభుత్వం పట్ల బలమైన అనుకూల భావన గానీ, వ్యతిరేకత గానీ లేనందున ప్రజలు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండియా కూటమికి అవకాశం ఇస్తారా? అంటే అదీ శూన్యమే. ఎన్డీయే కూటమికి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లలో భారీగా కోత పడటం ఖాయమని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
ఎందుకంటే గత ఎన్నికల్లోనే బీజేపీ తన అనుకూల ఉత్తరాది రాష్ర్టాలైన బీహార్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నది. మళ్లీ ఆ రాష్ర్టాల్లో అదే స్థాయిలో సీట్లు గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఆ పార్టీ 2019 ఎన్నికల నాటి మెజారిటీ స్థానాలను ఇప్పుడు దాటాలంటే ఈశాన్య, దక్షిణాది రాష్ర్టాలపైనే ఆధారపడాలి. కానీ, ఆ రాష్ర్టాలు బీజేపీకి మద్దతిస్తాయా అంటే ఆ పరిస్థితులు అంతంతమాత్రమే.
‘చార్సౌ పార్’ అన్న బీజేపీ నినాదం.. అభూత కల్పనేనని తొలి నాలుగు విడతలతోనే స్పష్టమైంది. 2024 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచి వికసిత భారత్ అని ప్రచారం చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఊసరవెల్లి వలె రంగు మార్చింది. మళ్లీ తన పాత పద్ధతిలోనే ప్రచారాన్ని సాగిస్తున్నది. హిందూ- ముస్లిం, అయోధ్య రామ మందిరం, పాకిస్థాన్, ఆర్టికల్- 370, కశ్మీర్, బాలాకోట్.. అంటూ పాత రాగాన్నే అందుకున్నది.
అయితే ఆ నినాదాలకు కాలం చెల్లింది. రామమందిరం ముగిసిన అధ్యాయం. అందుకే తమను గట్టెక్కించే బలమైన నినాదం కోసం ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ తరుణంలో ఆ పార్టీకి నీటిలో మునిగే వ్యక్తికి గడ్డిపోచ దొరికినట్టు ‘హిందూ-ముస్లిం’ నినాదమే మళ్లీ దిక్కయింది. అయితే ప్రజలు బీజేపీ ఎత్తుకున్న పాత నినాదాలు తమ బతుకులకు భరోసా కల్పించ వని కొట్టిపడేస్తున్నారు.
ఈ పాత నినాదాలు తమను గట్టెక్కించవని, తమ పుట్టి మునగడం ఖాయమని గ్రహించిన బీజేపీ నాయకులు ఈ ఎన్నికలను అధ్యక్ష ఎన్నికలుగా మార్చాలని చూశారు. ‘మోదీ వర్సెస్ రాహుల్’గా చేయాలని మొదటి నుంచి విఫలయత్నం చేశారు. తద్వారా దేశ ప్రధానిగా రాహుల్గాంధీ కంటే మోదీనే సరైన వ్యక్తి అనే ప్రచారాన్ని ముందుకు తేవాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వ్యూహాన్ని ముందే గ్రహించిన ఇండియా కూటమి.. బీజేపీ ట్రాప్లో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఒకప్పుడు ఉన్నట్టు.. మోదీని చూసి ఓట్లు వేసే పరిస్థితులు ఇప్పుడు దేశంలో లేవు. ఎందుకంటే, పాశ్చాత్య దేశాల వలె ఇవి అధ్యక్ష ఎన్నికలు కావు. ఎంపీ అభ్యర్థి, ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక సమస్యలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. మొత్తంగా మరోసారి అధికారంలోకి రావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ పాచికలు పారడం లేదు. బీజేపీయేతర నాయకులపై ఆ పార్టీ చేస్తున్న అవినీతి ఆరోపణలు కూడా పనిచేయడం లేదు. ఎందుకంటే, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే.. అవినీతి ఆరోపణలు చేసిన కమలనాథులే సదరు నాయకులకు బీజేపీ కండువాలు కప్పుతుండటం విడ్డూరం. అందుకే ఆ పార్టీ ఎప్పుడో విశ్వసనీయతను కోల్పోయింది.
కాంగ్రెస్తో సహా ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలంటూ చేసిన విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోకపోగా, అతని కుమారుడికి పార్టీ టిక్కెట్ ఇవ్వడం శోచనీయం. ఇలాంటి మరెందరో పరివార్ నేతలకు టికెట్లు ఇచ్చిన కమలం పార్టీ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హతను ఎప్పుడో కోల్పోయింది.
‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్టుగా.. తప్పుడు ప్రచారాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించే బీజేపీ ఇప్పుడు అవే తప్పుడు ప్రచారాలకు బలవుతున్నది. ‘400 సీట్లు’ అన్న నినాదమే ఆ పార్టీకి శాపంగా మారింది. అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకే కమలం పార్టీ 400 సీట్ల లక్ష్యం పెట్టుకున్నదని ప్రతిపక్షాలు తమ అస్త్రంగా మలచుకున్నాయి. అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డీప్ఫేక్ వీడియో ఒకటి వైరల్గా మారడం కమలం పార్టీని ఇరకాటంలో పడేసింది.
తమకు రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఉద్దేశం లేదని, తమ మ్యానిఫెస్టోలో ఆ అంశం లేదని చెప్తూ.. బీజేపీ నేతలు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. పెద్ద నోట్ల రద్దు లాంటి అనేక నిర్ణయాలు మ్యానిఫెస్టోలో పెట్టకుండానే తీసుకున్నది. అందుకే, ఆ పార్టీని బడుగు, బలహీన వర్గాలు నమ్మడం లేదు. మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా రిజర్వేషన్లను రద్దు చేస్తుందేమోనని భయం వారికి పట్టుకున్నది. ఈ నేపథ్యంలో కమలనాథుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.
బీజేపీ సంగతి ఇలా ఉంటే.. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా మారాయి. కాంగ్రెస్ బలహీనతలే బీజేపీకి బలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీమోదీ-షా వ్యూహాలను ఎదుర్కోవడం పక్కనపెడితే కనీసం స్థానిక నాయకుల వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచించలేకపోయింది. ఎన్నికలకు ముందే ఆ పార్టీ చేతులెత్తేసింది. సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో బీజేపీ ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నది. మరోవైపు ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి నాటకీయ పరిణామాల మధ్య తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ కనీసం పోటీలో లేకుండాపోయింది. పూరీలోనూ ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేయలేనంటూ ముందే కాడి వదిలేయడంతో కాంగ్రెస్ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.
ఈ పరిస్థితుల్లో ఇటు ఎన్డీయే, అటు ‘ఇండియా’ హవా, వేవ్ లాంటివేవీ లేవనేది సుస్పష్టం. రెండు కూటమిలలో ఏ ఒక్కదానికీ మెజారిటీ వచ్చే అవకాశాల్లేవు. ఈ విషయాన్ని బెంగాల్, కేరళ సీఎంలు మమత, విజయన్ లాంటి నేతలు ముందే పసిగట్టా రు. అందుకే ఇండియా కూటమితో అంటీముట్టనట్టు గా వ్యవహరించారు. ఈ తరుణంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు రెండు కూటములకు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకంగా మారనున్నది. రేపటి రోజున ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేనన్న విషయంలో సంశయం అక్కర్లేదు.
మాలోతు సురేష్
98856 79876