Ramayana | బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ మైథలాజికల్ చిత్రం రామాయణపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమను ప్రపంచస్థాయిలో మరో మెట్టుకు తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రాకపోతే తాను తీవ్రంగా నిరాశ చెందుతానని వ్యాఖ్యానించారు. ముంబై ఫిల్మ్ సిటీలో ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ప్రైమ్ ఫోకస్ ఏర్పాటు చేసిన ‘ప్రైమ్ వన్’ స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి స్టూడియోను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన, భారతీయ పురాణ ఇతిహాసాన్ని అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న చిత్రబృందం ప్రయత్నాన్ని అభినందించారు.
“రామాయణం సినిమా భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తుంది. ఈ స్థాయి ప్రాజెక్ట్కు ఆస్కార్ దక్కాలని ఆశిస్తున్నాను. అది జరగకపోతే నాకు నిజంగానే నిరాశ కలుగుతుంది” అని ఫడ్నవీస్ అన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా తన ప్రైమ్ ఫోకస్ సంస్థతో పాటు యశ్కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు DNEG సంస్థ నిర్వహిస్తోంది. ‘డ్యూన్’, ‘టెనెట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ఈ సంస్థ ఇప్పటివరకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పలు ఆస్కార్ అవార్డులను అందుకుంది. దీంతో ‘రామాయణం’ విజువల్ పరంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోందనే అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల శాన్ డియాగో కామిక్-కాన్తో పాటు న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా తొలి గ్లింప్స్ను ప్రదర్శించారు. అనంతరం విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు విజువల్స్ను ప్రశంసించగా, మరికొందరు గతంలో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు. ఈ నేపథ్యంలో శ్రీ రామ్లీలా మహాసంఘ్ ప్రతినిధులు చిత్రబృందాన్ని సంప్రదించి, సినిమా విడుదలకు ముందు తమకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఇలాంటి అంశాలపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ముందుగానే సినిమా చూసి తమ అభిప్రాయం తెలియజేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకపోతే నిరసనలు చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం