కలెక్టర్ హనుమంతరావు
దుబ్బాక, రాయపోల్, జూన్ 5: వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సజావుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలోని రాయపోల్, ఆరెపల్లి, కొత్తపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విషయంపై ఆరా తీశారు.
ధాన్యం తేమశాతం, కొనుగోలుకు సంబంధించిన రికార్డులు, ట్యాబ్లో నమోదు చేస్తున్న వివరాలు, ధాన్యం నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మూడు రోజుల్లో కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆయన సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీవల్లి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏపీఎందుర్గాప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.