CPM Tammineni | ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ అధికారంలోకి వస్తే, దేశంలో ఇవే చివరి ఎన్నికలు అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఎత్తేసి ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తారన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించడమే పరిరక్షణ మార్గం అని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల సంక్షేమానికి దిక్సూచిలా ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి, మనుధర్మ రాజ్యాంగం తీసుకొస్తారని ఆరోపించారు.
అర్హులందరికీ ఇల్లు, ఉద్యోగాలు, రైతుల పంటలకు మూడింతల మద్దతు ధర అని పదేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. ఒక్కటి కూడా ఆచరణలో చేయలేదన్నారు. ఢిల్లీలో రైతులు సుదీర్ఘకాలం నిరసన తెలిపినా ప్రధాని మోదీకి కనికరం కలుగలేదన్నారు. ఈ ఆందోళనలో వందల మంది రైతులు చనిపోయారని చెప్పారు.