Super El Nino | న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సూపర్ ఎల్ నినో బలపడనున్నదని, దీని ప్రభావం భారత్పై ఎక్కువగా కనిపిస్తున్నదని ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఆగస్టులో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతున్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. రాబోయే నెలల్లో ఎల్ నినో తీవ్రతరం అయ్యి, బలమైన ప్రభావం చూపనున్నదని, ఇది ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. జూన్లో తీవ్ర వర్షపాత లోటు నమోదు కాగా, జూలైలో అస్థిర మెరుగుదల కన్పించింది.
ఈ వాతావరణ పరిస్థితి అరుదైనదని, వేడెక్కుతున్న సముద్రాలతో కలిసి, ప్రపంచవ్యాప్తంగా కరువులు, తీవ్ర వేడిమి ప్రమాదాలను కలిగిస్తూ ఇప్పటికే ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) పేర్కొంది. అసాధారణంగా వేడెక్కిన సముద్రాలు, సానుకూల హిందూ మహాసముద్ర ద్విధ్రువం ఏర్పడే అవకాశం ఉండటంతో, ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలను తీసుకురావడంతో పాటు వర్షపాత సరళిని గణనీయంగా మారుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది అస్థిర వాతావరణంలోనే భారత దేశ రుతుపవనాల ప్రయాణం సాగుతున్నది. జూన్లో 39.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత దశాబ్ద కాలంలోనే అత్యంత పొడిగా ఉన్న నెలల్లో ఒకటిగా నిలిచింది. జూలై నెల వచ్చేటప్పటికి ఇవి పుంజుకున్నాయి. పలు అల్పపీడన వ్యవస్థలు చైతన్యం కావడంతో మధ్య, పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. అయితే ఈ పెరుగుదల అసమానంగా సాగింది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, మరికొన్ని చోట్ల లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తున్నది.
భారతదేశంలో నైరుతి రుతుపవనాలపై ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రమైన ముప్పుగా పరిణమించనున్నదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. పసిపిక్ మహా సముద్రంలో వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు, అసాధారణ రీతిలో బలపడుతున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. ఇది కరువు పరిస్థితులకు ఇది దారితీసే అవకాశం ఉన్నదన్నారు.