పటాన్చెరులో గులాబీ దళపతి కేసీఆర్ రోడ్షో హోరెత్తింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలు, గులాబీ శ్రేణులు కేసీఆర్ కోసం ఎదురుచూశారు. గంటగంటకూ జనాలు పెరిగారే తప్ప తగ్గలేదు. పటాన్చెరు వీధులు, జాతీయ రహదారి మొత్తం గులాబీమయం అయింది. విద్యుత్ కాంతుల మధ్య రోడ్షో తలుక్కుమన్నది. కళాకారుల ఆటపాటలు జనాల్లో ఉత్సాహం నింపాయి.
కేసీఆర్ బస్సులో రాత్రి 9.30గంటలకు పటాన్చెరుకు చేరుకోగానే గుర్రాలు, బోనాలు, ఒగ్గు కళాకారులతో పెద్దఎత్తున్న స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్టేజి వద్దే ఉండి బీఆర్ఎస్ శ్రేణులు, జనాన్ని కంట్రోల్ చేశారు. దారిపొడవునా గులాబీ అధినేతకు జనాలు నీరాజనం పట్టారు. పారిశ్రామిక ప్రాంతం ఒక్కసారిగా గులాబీ వర్ణంగా మారింది. కేసీఆర్ మాటలు వినేందుకు జనాలు స్వచ్ఛందంగా అంబేద్కర్ సర్కిల్ వద్దకు వచ్చారు. వ్యాపారులు, దుకాణదారులు, పక్కనే ఉన్న బస్టాండ్ వద్ద ప్రయాణికులు కేసీఆర్ స్పీచ్ని ఆసక్తిగా విన్నారు. అటు బీజేపీపైన.. ఇటు కాంగ్రెస్పైన ఆయన నిప్పులు చెరిగారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఎట్ల ఉండేదో.. ఇప్పుడు ఎట్ల ఉన్నదో ప్రజలు ఆలోచించాలని సూచించారు. బీజేపీ హయాంలో అచ్చేదిన్ రాలేదు కాని సచ్చేదిన్ వచ్చిదని కేసీఆర్ అనగానే జనాల నుంచి ఫుల్ రియాక్షన్ వచ్చింది. కేసీఆర్ పటాన్చెరు రోడ్షోలో అర్ధ గంట వరకు మాట్లాడారు. కేసీఆర్ స్పీచ్ సాగుతున్నంత సేపు సీఎం.. సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున్న జనాలు నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సారథ్యంలో పటాన్చెరు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయన్నారు. 24గంటలు ఫుల్ కరెంట్, నీళ్లు ఉండేవని, కార్మికులు చక్కగా పనిచేసుకునే వాళ్లని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి.. రియల్ఎస్టేట్ పడిపోయిందన్నారు. బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తేనే రాష్ర్టానికి మేలు జరుగుతుందని, మెదక్లో వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. స్పీచ్ అనంతరం ఆయన బస్సులో కొద్దిగా ముందుకు వెళ్లి అక్కడి నుంచి కారులో యూటర్న్ చేసుకొని ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి హైదరాబాద్కు వెళ్లారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించి ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించినట్లయితే పటాన్చెరుని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.