న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన దోషులను భారతీయ శిక్షా స్మృతిలో భాగంగా ఉరి తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉరి వేసి దోషిని చంపే ప్రయత్నాలను ఆపేయాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిల్ దాఖలైంది. ఉరికి బదులుగా, మరేదైనా నొప్పిలేని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిల్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. కాలం చెల్లిన ఉరి విధానాన్ని బహిష్కరించి, దాని స్థానంలో నొప్పి లేకుండా మరణశిక్షను అమలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. అయితే ఆ పిటీషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఇక ఈ కేసులో ఇదే తుది తీర్పు కాదు అని, భవిష్యత్తులో ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించవచ్చు అని, ఒకవేళ ప్రత్యామ్నాయ మరణాలపై ఏవైనా శాస్త్రీయ ఆధారాలు ఉంటే, దాని ప్రకారం మరణశిక్షను అమలు చేయవచ్చు అని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. ప్రస్తుతం రిట్ పిటీషన్ను డిస్మిస్ చేస్తున్నామని, కానీ భవిష్యత్తులో రాజ్యాంగం ధర్మాసనం ఈ విధానంపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది. శాస్త్రీయ విధానాల్లో మరణశిక్షను అమలు చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకోవచ్చు అని కోర్టు అభిప్రాయపడింది.
సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఈ పిల్ దాఖలు చేశారు. సీఆర్పీసీలోని సెక్షన్ 354(5) కింద ఉరి ద్వారా మరణశిక్షను అమలు చేసే వారు. అయితే ఆ సెక్షన్ను సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్ వేశారు. మరణశిక్ష అమలులో భాగంగా ఉరికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వాలని పిటీషనర్ అభిప్రాయపడ్డారు. అనేక దేశాలు ఉరి తీయడానికి బదులుగా ప్రత్యామ్నాయ రీతిలో మరణశిక్షలను అమలు చేస్తున్నాయన్నారు. మరణశిక్ష అమలు రీతిలపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. విషపూరిత ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేసే విధానం విజయవంతంగా జరగడంలేదని సీనియర్ న్యాయవాది మీనాక్షి ఆరోరా వాదించారు. ఈ అంశంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆ న్యాయవాది కోరారు.