సిద్దిపేట అర్బన్, మే 8 : సిద్దిపేట జిల్లాను రద్దు చేయడానికి కాంగ్రెస్ సర్కారు యత్నిస్తున్నదని, తన ప్రాణాన్ని పణంగా పెట్టయినా జిల్లా రద్దును అడ్డుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని శివానుభవ మండపంలో సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు జిల్లాలు రద్దుచేసే కుట్ర చేస్తున్నదని, తద్వారా మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాక తప్పదన్నారు. సిద్దిపేట జిల్లా కోసం ఎంత వరకైనా పోరాడుతానని హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట అంటే ఎక్కడికి పోయినా గౌరవం ఉండేలా చేశానని, ఆ గౌరవాన్ని మనం కాపాడుకుందామన్నారు. సిద్దిపేటకు వచ్చే నాయకులు మన మీద ప్రేమతో రావడం లేదని, మనలో ఉన్న ఐక్యతను దెబ్బతీసేందుకే వస్తున్నారన్నారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ దుబ్బాకలో ఏమి చేయకపోవడంతోనే అక్కడి ప్రజలు,
అసెంబ్లీ ఎన్నికల్లో 54 వేల ఓట్లతో ఆయన్ను ఓడించారన్నారు. వెంకట్రామిరెడ్డి గెలుపు హరీశ్రావు గెలుపు అని.. హరీశ్రావు గెలుపు కేసీఆర్ గెలుపు అని అన్నారు. సిద్దిపేట అభివృద్ధి కోసం వెంకట్రామిరెడ్డి నిత్యం పని చేస్తాడని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా తా ను పాల్గొన్నానని, హిందూ ధర్మ పరిరక్షణలో తాను భాగమయ్యానని.. భవిష్యత్లో ఉంటానని హామీ ఇచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పని చేస్తానని.. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుందన్నారు. ఫేక్ ప్రచారం చేయడంలో బీజేపీ అభ్యర్థి దిట్ట అని.. దుబ్బాక ఎన్నికల్లో అలాగే ఫేక్ ప్రచారాలు చేసి లబ్ధి పొందారని.. రేపటి నుంచి ఫేక్ ప్రచారం చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హరీశ్రావు సూచించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనకు పెట్టుబడులు రావడం లేదని, పరిశ్రమలు స్థాపన లేక రియల్ ఎస్టేట్ రంగం నేడు కుదేలైందన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నదన్నారు. ఇంకా రైతుబంధు రాలేదని, ఇదేనా మార్పు అని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చాయన్నారు.