ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సోమవారంతో ముగిసింది. ఈనెల 9న అర్థరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 3.94 లక్షల మంది ఓటర్లకు (13.16 శాతం) సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఏఫ్) ఇంకా డిజిటలైజ్ కాలేదు. దీంతో వీరంతా జాబితాలో ఉన్నారా.. లేదా? అనే సందిగ్ధం ప్రస్తుతం నెలకొన్నది. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు ఎన్నికల సంఘం విధించిన గడువు సోమవారంతో కంప్లీట్ అయింది. ఈసీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న బీఎల్వోలు చివరి నిముషం వరకు.. ఈఏఫ్లు డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈనెల 17న డ్రాఫ్ట్ జాబితా విడుదలతో పూర్తి స్పష్టత వచ్చే అవకాశమున్నది.
కరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 29,97,973 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి, వాటిని డిజిటల్ విధానంలో నమోదు చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ రాత్రి వరకు 26,03,473 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలు డిజిటలైజ్ చేశారు. అంటే మొత్తం ఓటర్లలో 86.84 శాతం ప్రక్రియ పూర్తయింది. ఇంకా 13.16 శాతం (3,94,500 మంది ఓటర్లు) ఫారాలు డిజిటలైజ్ చేయాల్సి ఉన్నది. దీంతో ఈ ఓటర్లు ఎక్కడ ఉన్నారు? వారి నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు అందాయా.. లేదా..? అందినా డిజిటలైజ్ కాలేదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నేడు మరింత స్పష్టత
రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమైంది. ఇంటింటికీ వెళ్లిన బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, వాటిని సేకరించారు. అనంతరం ఫారాల్లోని వివరాలను ఆన్లైన్లో డిజిటలైజ్ చేస్తున్నారు. మొదట నిర్ణయించిన గడువులోగా పూర్తికాకపోవడంతో ఎన్నికల సంఘం రెండుసార్లు గడువు పొడిగించింది. అయినా ఉమ్మడి జిల్లాలో ఇంకా 3.94 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఈఎఫ్లు డిజిటలైజ్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
డిజిటలైజ్ కాని 3.94 లక్షల మంది ఓటర్లు ఓటరు జాబితాలో కొనసాగుతారా..? లేక డ్రాఫ్ట్ జాబితా నుంచి వారి పేర్లు తొలగుతాయా..? అన్నది ఈ నెల 17న వెలువడే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాతో తేలే అవకాశమున్నది. డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు లేకపోతే సంబంధిత ఓటర్లకు క్లెయిమ్స్, అభ్యంతరాల దశలో తమ వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంటుందా.. లేదా..? అన్నది అధికారులు స్పష్టంగా తెలుపాల్సిన అవసరమున్నది. మరోవైపు డిజిటలైజ్ కాని ఓటర్లలో ఎంతమంది వాస్తవంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు?
ఎంతమంది మరణించారు? ఎంతమంది అందుబాటులో లేరు? ఎంతమంది ఫారాలు సమర్పించలేదు? వంటి వివరాలు కూడా తర్వాత దశలో వెల్లడయ్యే అవకాశమున్నది. మొత్తం మీద ఈ 3.94 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టా..? లేనట్టా..? అన్న ప్రశ్నకు మంగళవారం మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది. కాగా ఈ నెల 17న ఓటర్ల డ్రాఫ్టు పబ్లికేషన్ చేస్తారు. అలాగే ఏవైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 16వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అభ్యంతరాలు క్లెయిమ్స్, డిస్పోజల్స్ ఈ నెల17 నుంచి 15 అక్టోబర్ వరకు చేస్తారు. 19న ఫైనల్ జాబితాను ప్రకటిస్తారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Karimnagar1