చేగుంట, ఆగస్టు 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మూడు రోజులుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చేగుంట సర్పంచ్ అభ్యర్థి దుంపల రమ్యాడిష్రాజు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఫలహార బండిని కొత్త ప్రభాకర్రెడ్డి ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమం కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారన్నారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని,తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గుడికట్టుకున్నాడన్నారు. గోదావరి జలాలను ఇక్కడికి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఉప కాల్వలు పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోబీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోమండ్ల నారాయణరెడ్డి,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు,బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, మాజీ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, మమ్మద్ అలీ, శ్రీకాంత్, ఎర్ర యాదగిరి, సోమ సత్యనారాయణ, మహేశ్, పులబోయిన రవి, సంపత్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గ్గొన్నారు.