నిజామాబాద్, మే 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన బస్సు యాత్ర గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని అందించింది. కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతూ ఉమ్మడి జిల్లాను రెండు రోజులపాటు చుట్టేయడంతో శ్రేణులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ రోడ్డు షోకు తండోపతండాలుగా జనం రావడంతోపాటు గులాబీ బాస్కు అడుగడుగునా నీరాజనం పలకడంతో బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలుపెరగని పోరాటం చేస్తున్న కేసీఆర్కు ప్రజల మద్దతు విశేషంగా లభించడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు మొదలైంది. గులాబీ పార్టీకి గెలుపు అవకాశాలు పెరగడంతో రెండు జాతీయ పార్టీల్లో నైరాశ్యం అలుముకున్నది. రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండడంతో సరిదిద్దుకోలేక హస్తం, కమలం పార్టీలు తంటాలు పడుతున్నాయి. కేసీఆర్ పర్యటన కారు పార్టీ లోక్సభ అభ్యర్థులకు వెయ్యి ఏనుగుల బలాన్ని అందించింది. మే 13న జరిగే పోలింగ్కు జనామంతా గులాబీ పార్టీకి మద్దతు తెలిపేందుకు సంసిద్ధం అవుతున్నారు. గులాబీ దళపతి ప్రసంగాన్ని విన్న వారంతా ఆలోచనలో పడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల స్థితిగతులు అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లుంది..? అనుకుంటూ వాస్తవాలను గ్రహించుకుంటున్నారు.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వైవిధ్యతను సంతరించుకున్నది. ఈ ప్రాంతం బీఆర్ఎస్ పార్టీకి పెట్టనికోట. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాలంతా ఏకపక్షంగా మద్దతు అందించి జడ్పీ పీఠాన్ని గెలిపించారు. సమైక్య పాలకులకు ముచ్చెమటలు తెప్పించి విలక్షణమైన తీర్పును అందించారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ అదే తీర్పు ప్రస్ఫుటంగా కనిపించబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పోటీ చేసి దిగ్విజయమైన విజయాన్ని అందుకున్నారు. తదనంతరం 2019లో అబద్ధపు హామీలు, ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చి అసత్యాలను ప్రచారం చేసి పసుపు రైతులను నట్టేట ముంచి ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు. ఇప్పుడు వాస్తవాలను ప్రజలంతా గ్రహించారు. దీంతో బీజేపీ ఎంపీకి ప్రస్తుతం గడ్డుకాలం కొనసాగుతున్నది. ప్రచారంలో పలుచోట్ల నిరసనలు, అడ్డగింతలు సైతం ఎదురవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీపై బీజేపీలోనే తీవ్రమైన ఆగ్రహావేశాలు రగులుతుండగా అర్వింద్ను బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర అనంతరం జనాల్లో మైలేజ్ పెరగడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మే 11వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లి వారి ఆశీస్సులను పొంది బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నారు.
జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్డు షోలకు విశేష ఆదరణ లభించడంతో గులాబీ పార్టీలో ఉత్సాహం పెరిగింది. కాంగ్రెస్, బీజేపీల కన్నా ప్రచారంలో ఎంతో ముందున్న బీఆర్ఎస్ పార్టీకి అధినేత టూర్ మరింత కలిసి వచ్చినైట్లెంది. గాలి అనిల్ కుమార్ అలుపెరగని ప్రచారంతో జనాల్లోకి దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్ అవకాశవాద రాజకీయాలను జనాలంతా ఛీ కొడుతున్నారు. పలుచోట్ల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని చోట్ల నిలదీస్తున్నారు. పదేండ్లలో చేసిందేమిటి? అం టూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎంపీగా పని చేసిన సురేశ్ షెట్కార్ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో ఈయనకు అదే పరిస్థితి ఏర్పడుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నెలకొన్న గడ్డు పరిస్థితులకు సమాధానం చెప్పలేక హస్తం పార్టీ అభ్యర్థి ముఖం చాటేస్తుండడం కనిపిస్తున్నది. కామారెడ్డిలో నిర్వహించిన కేసీఆర్ టూర్ దిగ్విజయంతో శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పని చేసేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ టూర్కు తరలివచ్చిన జనాలను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలంతా ఖంగుతింటున్నారు. మొత్తానికి నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన కేసీఆర్ బస్సు యాత్ర అనుకూల ఫలితాలను రాబట్టేందుకు మంచి రాచబాటను ఏర్పర్చినట్లుగా అయ్యింది.