Artificial Rain | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్! ఏడు రాజ్యాల కూటమి. పేరుకే ఎడారి. వర్షం లేని లోటును కనక వర్షం తీరుస్తున్నది అక్కడ. ఇసుకతిన్నెల రంగును మరిపించే బంగారం మురిపిస్తున్నది. లోకం అంతా తల తిప్పుకొని చూసేలా, అక్కడ స్థిరపడితే చాలు అని వలసజీవులు అనుకునేలా సంపదను సృష్టిస్తున్నది. అరబ్ ఎమిరేట్స్లో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. అయితే వెర్రెక్కించే ఎండ, లేదా వణికించే చలి. ఈ రెండిటి మధ్యా వర్షపు జాడ కష్టమే! అక్కడి పర్వతప్రాంతాలలో కాస్త వర్షపాతం నమోదవుతుందేమో కానీ, ఇతర తీర ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు అటూ ఇటూగానే ఉంటుంది.
తెలంగాణ సగటు వర్షపాతం 906 మిల్లీమీటర్లతో పోలిస్తే.. ఇదెంత తక్కువో అర్థమవుతుంది. సాగు, తాగునీటి వనరులు అంతంత మాత్రమే. వందల అడుగుల కిందకి అడుగంటిన భూగర్భజలాలు, సముద్రపు నీటిలోని ఉప్పదనాన్ని తొలగించిన నీరు మాత్రమే ఆధారం. అందుకే కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతుంటాయి. అందుకోసం ప్రత్యేకమైన శాఖ కూడా ఉంది. కానీ మొన్న కురిసిన భారీ వర్షాలతో… అక్కడి వాతావరణం గురించి, కృత్రిమ వర్షాల యత్నాల గురించి కొత్త వాదనలు, చర్చలు మొదలయ్యాయి!
15 ఏప్రిల్ 2024.. సాయంత్రం. అప్పటిదాకా ఉక్కపోతగా ఉన్న అల్ ఐన్ నగరంలో ఒక్కసారిగా గాలి మొదలైంది. నీలాకాశం కాస్తా ధూళితో పసుపురంగు పులుముకుంది. చినుకులు మొదలయ్యాయి. చినుకు… చినుకు వర్షం అయ్యింది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన ఆ వర్షం వరదలా ముంచెత్తింది. ఏకంగా 255 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అరబ్ ఎమిరేట్స్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఏడాది మొత్తం కురిసే వర్షపాతం… ఒక్కరాత్రిలో నమోదైంది. 75 ఏండ్ల రికార్డులు బద్దలయ్యాయి. ఓడలు బండ్లు… బండ్లు ఓడలు అవుతాయి అనే మాటను అక్కడి నీటిలో తేలుతున్న కార్లు గుర్తుచేశాయి. ఈ ప్రళయం ముందు ఏ సౌకర్యమూ నిలబడలేకపోయింది. ఏ అడ్డుగోడా ఆపలేకపోయింది. జీవితం ఒక్కసారిగా స్తంభించిపోయింది. విమానాలు నేల మీదే తచ్చాడాయి. ఈ వర్షపు వార్తలు, కలవరాల మధ్య… ఓ అనుమానం స్పష్టంగా వినిపించింది. ఈ కల్లోలానికి కారణం కృత్రిమ వర్షమేనా?
ఆకాశంలో కనిపించే ప్రతి నల్లమబ్బూ… కురవదు. ఊరించి వెళ్లేవే ఎక్కువ. మబ్బులలో ఉండే వర్షపు చుక్కలు తగినంత దట్టంగా లేకపోతే, అవి తేలిపోతాయి. మబ్బు భారమైనప్పుడే, అందులోని నీటి బిందువులు లేదా మంచుగడ్డలు నేల మీదకు జారతాయి. మబ్బులలో సాంద్రతను పెంచాలి అంటే… దూరదూరంగా ఉన్న నీటి బిందువులు దగ్గర కావాలి లేదా అవి ఘనీభవించి మంచుగా మారాలి. ఓ 130 ఏండ్ల క్రితమే… మబ్బులను ఇలా ఏమార్చి, వర్షం కురిపించే ఆలోచనలు మొదలయ్యాయి. మబ్బుల్లోకి మట్టి, ఉప్పు, కార్బన్ డయాక్సైడ్… ఆఖరికి టాల్కం పౌడర్ సహా రకరకాల పదార్థాలు చల్లి వాటిని కురిపించడంలో విఫలమయ్యారు. దాదాపు యాభై ఏండ్ల తర్వాత కానీ ఈ పరిశోధనలు ఓ కొలిక్కి రాలేదు. 1946లో మొదటిసారిగా డ్రై ఐస్ ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించారు. అప్పటినుంచి అడపాదడపా, ఈ పద్ధతిని వాడుతూనే ఉన్నారు. కృత్రిమ వర్షాలను కురిపించడానికి అయ్యే ఖర్చు, కావాల్సిన సాంకేతికత చాలా ఎక్కువ. దాని ఫలితాల మీద ఇప్పటికీ కచ్చితమైన అంచనాలు లేవు. పైగా మబ్బులున్నంత మాత్రాన సరిపోదు. వాటి మీద ప్రయోగాలు చేసేందుకు మరికొన్ని అనువైన పరిస్థితులు కూడా ఉండాలి. అందుకే కృత్రిమ వర్షాల గురించి వార్తలు తక్కువే వినిపించేవి. కానీ, కాలం మారుతున్నది. కొత్త పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి.
నల్ల మబ్బుల్లోని నీటి బిందువులను ఘనీభవింపచేయడానికి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, ప్రొపేన్, డ్రై ఐస్ లాంటి పదార్థాలను వాడతారు. ఉప్పులాంటి కొన్ని పదార్థాలు చుట్టూ ఉన్న తేమను పీల్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటిని హైగ్రోస్కోపిక్ పదార్థాలు అంటారు. మబ్బుల్లోని బిందువులు దగ్గరకు వచ్చేందుకు ఇవి సాయపడతాయి. మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయి, ఎంత ఎత్తులో ఉన్నాయి, ఏ దిశగా ప్రయాణిస్తున్నాయి, వాటిలో నీటి శాతం ఎంత… లాంటి రకరకాల అంచనాల తర్వాత వాటిని నీరుగార్చే (క్లౌడ్ సీడింగ్) ప్రయత్నం మొదలవుతుంది. అందుకు అనుకూలమైన రసాయనాన్ని విమానాల ద్వారా వెదజల్లుతారు లేదా కింద నుంచి మేఘాల దిశగా వాటిని విసురుతారు. కృత్రిమ వర్షం కోసం ఇలా రసాయనాల వాడకంతోపాటు మబ్బులు వర్షాన్ని కురిపించేలా, వాటికి విద్యుద్ఘాతాన్ని కలిగించడం… లేజర్ కిరణాల ద్వారా వాటిని వర్షింపచేయడం లాంటి సాంకేతికతలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
గల్ఫ్ తీరంలో కృత్రిమ వర్షాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేది అరబ్ ఎమిరేట్సే! అధిక జనాభా అవసరాలు తీర్చలేని వర్షపాతం… ఆ కాస్త వర్షం కూడా ఎడారిలో ఇంకిపోవడమే ఇందుకు కారణం! 2010 నుంచే ఇక్కడ కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నారు. ఈ రంగంలో పరిశోధనలు జరిగేందుకు, కొత్త పద్ధతులు కనుగొనేందుకు UAEREP అనే ప్రత్యేక ప్రాజెక్టును కూడా ఆ దేశం మొదలుపెట్టింది. ఇందుకోసం కోట్ల రూపాయలను ధారాళంగా ఖర్చుచేస్తున్నది కూడా! కొన్నేండ్ల నుంచి డ్రోన్ల సాయంతో కూడా మేఘాలకు ఎలక్ట్రిక్ షాక్స్ ఇప్పిస్తూ వర్షం కురిపించే ప్రయత్నం జరుగుతున్నది. దుబాయ్, అబుదాబి లాంటి ప్రదేశాల్లో విజయవంతంగా వర్షాలు కురిపించిన నేపథ్యం తనకు ఉంది. అయితే ఈ ప్రయాణంలో కొన్ని అపవాదులూ లేకపోలేదు. 2019లో వచ్చిన వరదలకు కూడా క్లౌడ్ సీడింగే కారణం అన్న ఆరోపణ ఉంది. ఈ ఏడాది వచ్చిన వరదల వెనుక కూడా ఇదే మాట వినిపించింది. అయితే ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు అరబ్ నిపుణులు. వాళ్లు చెబుతున్న మాటల ప్రకారం ‘మేము చేసే ప్రయత్నాల వల్ల వర్షపాతం 10 శాతం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మహా అయితే 30 శాతం పెరుగుతుంది. అంతేకానీ కృత్రిమ వర్ష ప్రయత్నాలతో వరదలు రావడం అసాధ్యం! పైగా భారీ మబ్బుల జోలికి మేము వెళ్లం. చాలా సంక్లిష్టమైన రాడార్ వ్యవస్థ ద్వారా అలాంటి మేఘాలను ముందుగానే కనిపెట్టి, వాటికి దూరంగా ఉంటాం’ అని వివరణ ఇచ్చారు అక్కడి నిపుణులు.
అరబ్ ఎమిరేట్స్ వరదలు క్లౌడ్ సీడింగ్ వల్ల కాదు అనేందుకు ఊతమిస్తూ, ఇలాంటి చాలా విశ్లేషణలే వినిపిస్తున్నాయి. కృత్రిమ వర్షాల కోసం చేసే ప్రయత్నం కొన్ని గంటల వరకే ప్రభావం చూపుతుంది. కానీ, దుబాయ్లో వరదలు వచ్చిన రోజున అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. పైగా వరదలకు ముందే… వాతావరణ శాఖ భారీ వర్షసూచనను అంచనా వేసింది. అయినప్పటికీ, ఈ వరదలకు క్లౌడ్ సీడింగ్కి సంబంధం ఉందనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించే రసాయనాలు అక్కడి పరిసరాలలోనే ఉండిపోతున్నాయనీ, అవి అక్కడి వాతావరణం మీద, ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయనీ నిపుణులు చెబుతున్నారు.
మన దేశ ఆర్థిక రంగం, వర్షాల మీదే ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో, తగినంత వర్షపాతం లేకపోతే… సాగుకు, తాగుకు కష్టమే. అందుకే కరువు కాలం సవాలు చేసినప్పుడల్లా, కృత్రిమ వర్షాల గురించి చర్చ జరుగుతుంది. తమిళనాడు, కర్ణాటక సహా చాలా రాష్ర్టాలలో క్లౌడ్ సీడింగ్ జరిగింది. కృత్రిమ వర్షాల ప్రయోగం జరిగినప్పుడు మహరాష్ట్రలో 18 శాతం వర్షపాతం పెరిగినట్టు అంచనా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మేఘమథనం పేరుతో కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏటా చలికాలంలో దిల్లీ ఆకాశం మసకబారిపోయే విషయం అందరికీ తెలిసిందే. పంట వ్యర్థాలను తగలబెట్టిన పొగ, వాయు కాలుష్యం, మంచు… అన్నీ కలగలిసి ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి. కొద్దిరోజులపాటు జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కనుక కృత్రిమ వర్షాలను కురిపిస్తే, వాతావరణంలో ఉన్న ధూళికణాలు నేల మీదకు చేరుకుని ఆకాశం తేటగా మారుతుందని ఓ సూచన వినిపించింది. ఆ దిశగా ప్రయత్నాలూ మొదలయ్యాయి!
క్లౌడ్ సీడింగ్ కోసం జరిగే ఖర్చు, ఉండాల్సిన సాంకేతికత గురించి చర్చ అక్కర్లేదు. కాలాన్నిబట్టి అవి మారుతుంటాయి. కానీ, అది ఎంతవరకు ఉపయోగం అన్న ప్రశ్నకు మాత్రం జవాబు ఆలోచించాల్సిందే. ఇజ్రాయెల్ లాంటి దేశాలు వాటివల్ల పెద్దగా లాభం లేదనుకుని, కృత్రిమ వర్షాల జోలికి పోవడం లేదు. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధన, క్లౌడ్ సీడింగ్ వల్ల పెద్దగా ఫలితాలు లేకపోగా వడగళ్ల వాన లాంటి పరిస్థితులు తలెత్తవచ్చునని పెదవి విరిచింది. ఈ ప్రక్రియ కోసం ఉపయోగించే సిల్వర్ అయోడైడ్ లాంటి పదార్థాల వల్ల పర్యావరణానికే కాదు జీవులకు కూడా ముప్పు వాటిల్లుతుందని కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఎడారిలాంటి ప్రదేశాల్లో కృత్రిమ వర్షాలను కురిపించినా, అది అక్కడి వాతావరణాన్ని మార్చేస్తుంది. ఈ ప్రభావం అక్కడితో ఆగదు. ఉదాహరణకు అరేబియా ఎడారుల దగ్గర వీచే గాలులు అటుతిరిగి ఇటుతిరిగి భారతీయ రుతుపవనాలకు దోహదపడతాయి. అందుకే కృత్రిమ వర్షాల పేరుతో ప్రకృతిని మార్చే ప్రయత్నం అంత మంచిది కాదని కూడా అంటున్నారు.
ఒక్క విషయాన్ని మాత్రం మనం కచ్చితంగా గుర్తించాలి. గ్లోబల్ వార్మింగ్ అనేది ఓ సిద్ధాంతమో, అనుమానమో కాదు. ఒప్పుకోవల్సిన వాస్తవం. ఏటా కోటి హెక్టార్ల అడవిని మనం నరికేస్తున్నాం. ప్రాణవాయువును అందించే ముఖ్యమైన ఆధారం చెట్టు అని గుర్తిస్తే, దీని ప్రభావం మనకు అర్థం అవుతుంది. మరోవైపు సహజ ఇంధన వనరులను మండించేస్తున్నాం. ఇక కార్ల నుంచి పరిశ్రమల వరకు వెలువడే పొగ, ఇంటి నుంచి కంపెనీల వరకు వెలువడే కాలుష్య కారకాల గురించి చెప్పనవసరం లేదు. ఇవన్నీ కూడా భూతాపానికి దారి తీస్తున్నాయి. శరీరం వేడెక్కినప్పుడు చెమట రూపంలో, ఒంటి నుంచి వేడి వాతావరణంలో కలుస్తుంది. భూమి కూడా అంతే. అది వేడెక్కినప్పుడు, ఆవిరి రూపంలో నీరు వాతావరణంలోకి వస్తుంది. అంతెత్తున చల్లబడిన తర్వాత మళ్లీ ఆ నీరు నిదానంగా వర్షంగా నేల మీదకు కురుస్తుంది. కానీ భూతాపం పెరగడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతం అవుతున్నది. అంతేకాదు! వేడిగాలిలో తేమ 6-7 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ ఉపరితల పీడనానికి దారితీసి, భారీ వర్షాలకు కారణం అవుతున్నాయి. ఎక్కడా ఇసుమెత్తు ఇసుక కనిపించకుండా, పచ్చదనమే లేకుండా.. విపరీతమైన కాలుష్యంతో ఉండే ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో తరచూ భారీ వర్షాలు కురవడానికి కారణమూ ఇదే అని చెబుతున్నారు.
మనం దుబాయ్గా పిలుచుకునే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దాంతోపాటు కొన్ని ప్రశ్నలూ సంధించాయి. కృత్రిమ వర్షాల వల్లే ఇదంతా జరిగిందని నిరూపితం కాకపోయినా, ఇలాంటి సందర్భాలకు దారి తీయవచ్చనే కొత్త అనుమానాలకు దారితీశాయి. గ్లోబల్ వార్మింగ్ గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అగత్యాన్ని కల్పించాయి. ఇలాంటి భారీ వరదలకు అరబ్ ఎమిరేట్స్ సిద్ధంగా లేదని అక్కడి దృశ్యాలు చెబుతున్నాయి. పొడి వాతావరణం కాబట్టి… భారీ వర్షాల వల్ల వచ్చే వరదనీరు ఇంకేందుకు, దారి మళ్లేందుకు మరింత కట్టుదిట్టమైన వ్యవస్థను రూపొందించుకోవాల్సి ఉంది.
కృత్రిమ వర్షాలకు సంబంధించి కొన్ని విచిత్రమైన నమ్మకాలు (కాన్స్పిరసీ థియరీస్) కూడా ప్రచారంలో ఉన్నాయి. క్లౌడ్ సీడింగ్ సాంకేతికతను శత్రుదేశాలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారని కొందరి వాదన. ఉదాహరణకు వియత్నాం యుద్ధ సమయంలో ఉత్తర వియత్నాం నుంచి శత్రువుల సైనిక సామాగ్రి రవాణాను కష్టతరం చేసేందుకు, అమెరికా దేశం అక్కడ వర్షపాతం పెంచే ప్రయత్నం చేసిందని అంటారు. దీనికి ఆపరేషన్ పపాయ అని పేరు. ఇంతేకాదు! చాలా ప్రభుత్వాలు ఇలాంటి సాంకేతికతల మాటున రకరకాల ప్రయోగాలు చేస్తుంటాయని మరో సిద్ధాంతం. అందుకు ఉదాహరణ ‘కెమ్ ట్రైల్ థియరీ’. జెట్ విమానాలు వెళ్తున్నప్పుడు వెనకాల తెల్లటి చారలు కనిపిస్తాయి కదా! అది నిజానికి పొగ కాదు… ఆ విమానం వదిలి వెళ్తున్న రసాయనాలు అంటుంది ఈ కెమ్ ట్రైల్ థియరీ. జనాభా నియంత్రణ దగ్గర నుంచి ప్రజల మనసుల్ని ప్రభావితం చేయడం వరకు రకరకాల ఉద్దేశాలతో కూడిన రసాయనాలు ఇందుకు ఉపయోగిస్తారు అన్నది ఈ సిద్ధాంతం!
క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో వాన కురిపించడం మాత్రమే కాదు… ఇతర లాభాలూ లేకపోలేదు. ఇలాంటి సందర్భాల్లో చైనా ముందుంటుంది కదా! చైనా కేవలం నీరు కావల్సినప్పుడే కృత్రిమ వర్షం కురిపించడం లేదు. 2008లో బీజింగ్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నప్పుడు… వాటికి వర్షం అడ్డు రాకుండా ఉండటానికి, ఆటలు జరగడానికి కొద్దిరోజుల ముందుగానే అక్కడ ఉన్న మబ్బులన్నిటినీ నీరుగార్చేశారట. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఉత్సవాల సమయంలో ఆహ్లాదం కలిగించేందుకు కృత్రిమ వర్షం కురిపించారనే వార్తలు వినిపించాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా వర్షాన్ని కురిపించిన నివేదికలు వచ్చాయి. ఆఖరికి తన దేశంలోకి ప్రవేశించిన మబ్బులు ఎక్కడ ఇతర దేశాల వైపు తరలిపోతాయేమో అన్న ఆత్రుతతో, అవసరం లేకున్నా కృత్రిమ వర్షాలు కురిపించుకున్న ఘనత చైనాది. తుపానుల ప్రభావం తగ్గించడానికి కూడా వాటి తొలిదశలో క్లౌడ్ సీడింగ్ చేసిన ప్రయోగాలు ఉన్నాయి. సైరస్, స్టార్మ్ ఫ్యూరీ, బాటన్ లాంటి పేర్లతో అమెరికా రకరకాల ప్రాజెక్టుల ద్వారా ఇలాంటి ప్రయత్నాలు చేసింది. మలేసియాలో కార్చిచ్చులను ఆర్పేందుకు కృత్రిమ వర్షాలను కురిపించారు.
చుట్టూ ఉన్న వాతావరణం నుంచి నీటిని సాధించేందుకు కృత్రిమ వర్షాలు ఒక్కటే మార్గం కాదు. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి.
– కె.ఎల్. సూర్య