జూలూరుపాడు, జూన్ 09 : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వైరా నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకే తాటిపైకి వచ్చి, సమన్వయంతో పనిచేసి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను, బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.
ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం తీసుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పార్టీకి కార్యకర్తలే అసలైన వెన్నెముక అని వారి కష్టాన్ని గుర్తిస్తూ రాబోయే రోజుల్లో సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో కార్యకర్తలు ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, గిద్దగిరి సత్యనారాయణ, తాళ్లూరి రామారావు, పురస్తపురపు రామకృష్ణ, భూక్య రాందాస్ పాల్గొన్నారు.