– మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
రుద్రంపూర్, జూన్ 09 : దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పన అంశంపై అధ్యయనం చేస్తున్న జస్టిస్ కె.ఎన్. బాలకృష్ణన్ కమిషన్ పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో కమిషన్ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం 2022లో జస్టిస్ కె.ఎన్. బాలకృష్ణన్ నేతృత్వంలో రెండేళ్ల కాల పరిమితితో కమిషన్ను ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు సమగ్ర స్థాయిలో అధ్యయనం పూర్తి కాలేదన్నారు. దేశ వ్యాప్తంగా పర్యటించి దళిత ముస్లింలు, దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక పరిస్థితుల కమిషన్ విచారణ జరపాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం ఏడు రాష్ట్రాల్లో మాత్రమే పర్యటించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా కమిషన్ పర్యటించకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కార్యాలయం ద్వారా మాత్రమే వివిధ సంఘాల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తోందని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో కమిషన్ నివేదిక సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని యాకూబ్ పాషా ఆందోళన వ్యక్తం చేశారు. దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తే విద్య, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అందువల్ల కమిషన్ గడువును పొడిగించి దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు నిర్వహించి లోతైన అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.