Lavanya Tripathi | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 6 రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే హైదరాబాద్లో నిర్వహించిన ప్రీమియర్ షోకు వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా థియేటర్లో చోటుచేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లోని మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన వరుణ్ తేజ్కు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన రాకతో థియేటర్ మొత్తం సందడి వాతావరణంగా మారిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ, విజిల్స్ వేస్తూ, పేపర్లు ఎగురవేస్తూ సినిమా థియేటర్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా అభిమానులు ఒక్కసారిగా “జై జనసేన” అంటూ నినాదాలు చేయడంతో థియేటర్ మార్మోగిపోయింది. ఆ సమయంలో మొబైల్ ఫోన్లో ఏదో చూస్తున్న లావణ్య త్రిపాఠి అభిమానుల నినాదాలు వినగానే వెంటనే స్పందించి వారితో కలిసి “జై జనసేన” అంటూ నినాదాలు చేశారు. దీంతో అభిమానులు మరింత ఉత్సాహానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, వరుణ్ తేజ్ ఇటీవల కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అభిమానుల కోసం ప్రీమియర్ షోకు హాజరైన ఆయన మెట్లు ఎక్కే సమయంలో లావణ్య త్రిపాఠి పక్కనే ఉండి సహాయం చేయడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా వరుణ్ తేజ్ చేతులు జోడించి అభివాదం చేయగా, ఆ క్షణాలను లావణ్య తన మొబైల్లో వీడియోగా చిత్రీకరించారు.
ఈ ప్రీమియర్ షోకు చిత్ర కథానాయిక రితికా నాయక్ కూడా హాజరయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య, రితికా రాకతో థియేటర్ వద్ద అభిమానుల సందడి మరింత పెరిగింది. ఇక ‘కొరియన్ కనకరాజు’ సినిమాకు ప్రీమియర్ షోల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వరుణ్ తేజ్ నటన, సత్య కామెడీ ట్రాక్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగా, కథనం, దర్శకత్వంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.