హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ-2గా అర్వింద్కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ-4గా కోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ-5గా ఫార్ములా ఈ-ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈవో)కు చెందిన అబ్లెర్టో లాంగోను నిందితులుగా చేర్చారు.
ఈ కేసులో రూ.54.88 కోట్లను అక్రమంగా ఎఫ్ఈవోకు చెల్లించారనే అభియోగం మోపుతూ ప్రభుత్వ సూచన మేరకు ఐఏఎస్ దానకిశోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు పలుమార్లు కేటీఆర్, అర్వింద్కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించారు. అయితే, ఈ రేసు నిర్వహణలో అక్రమంగా ఎలాంటి లావాదేవీలు జరుగలేదని, అంతా పారదర్శకంగా ఉన్నదని, ప్రభుత్వ కుట్రలో భాగంగానే విచారణలు చేయిస్తున్నారని పలుమార్లు కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని చెప్తున్నారు.