Mahila Samman | పోస్టాఫీస్ ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం మహిళలకు విశేషంగా లాభాలను పంచుతున్నది. ఈ పథకం కాలవ్యవధి రెండేండ్లు. కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.2 లక్షలదాకా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా డిపాజిట్ చేసిన మహిళలకు రెండేండ్ల తర్వాత వడ్డీల రూపంలో మరో రూ.30 వేలకుపైగా అదనంగా లభిస్తాయి. ఈ స్కీంపై 7.5 శాతం వార్షిక వడ్డీ ఉన్నది. రూ.2 లక్షల పెట్టుబడిపై తొలి ఏడాది రూ.15 వేలు వడ్డీ రూపంలో వస్తుంది.
రెండో ఏడాది మరో రూ.16,125 వస్తాయి. అంటే రూ.2 లక్షలపై రూ.31,125 అదనంగా అందుకోవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో పొందే వడ్డీ ఆదాయం రూ.40,000 దాటితే టీడీఈఎస్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లపై ఈ భారం పడుతున్నది. అయినప్పటికీ పోస్టాఫీస్ ప్రవేశపెట్టిన అన్ని స్కీంలలో ఇదే అత్యుత్తమ పథకమని చెప్పవచ్చు.
మహిళా సాధికారత, స్వావలంబన లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ స్కీం కింద డిపాజిట్ చేసిన వారికి ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలైతే లభిస్తున్నాయి. ఇక పదేండ్ల వయస్సు దాటిన ఆడపిల్లల నుంచి ఎంత వయసు మహిళలైనా ఇందులో చేరవచ్చు. అయితే భారతీయులై ఉండాలి. కేవలం ఆడవారి కోసమే ఉద్దేశించిన ఈ పథకంలో ఆడపిల్లల తరఫున వారి సంరక్షకులు, తల్లిదండ్రులు పెట్టుబడులు పెట్టవచ్చు.