కోటగిరి, మే 9: రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉన్నదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తిన గులాబీ జెండా తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఐదునెలల్లోనే వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. ఉమ్మడి కోటగిరి మండలంలోని శ్రీనివాసకాలనీ, లింగాపూర్, కల్లూర్, జల్లాపల్లి అబాది, జల్లాపల్లిఫారం, పొతంగల్,ఎత్తొండ, దోమలెడ్గి, కోటగిరిలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి గాలి అనిల్కుమార్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
అధికారం కోసం సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయలేక చేతులెత్తేశాడని ఎద్దేవా చేశారు. పొలాలు ఎండగొట్టిన కాంగ్రెస్ సీఎం ఏం ముఖం పెట్టుకొని రైతుల ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్నారు. జహీరాబాద్ ఎంపీలుగా బీబీపాటిల్, సురేశ్ షట్కార్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో వచ్చిన గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు శంకర్పటేల్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, నీరడి గంగాధర్, పత్తి లక్ష్మణ్, కూచి సిద్దూ, అనిల్, హౌగిరావుపటేల్, శ్రీధర్, గంట్ల విఠల్, లింగప్ప, వెంకట్రెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.