న్యూఢిల్లీ: ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే న్యూస్ కోసం సోషల్ మీడియాపై జనం ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీన్నే ఆధారం చేసుకుని .. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు చెందిన మెటా సంస్థ.. ఏఐ ఆధారిత పొలిటికల్ యాడ్స్(Political Ads)ను రిలీజ్ చేస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఎన్నికల వేళ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, మతపరమైన హింసను ప్రేరేపించేలా మెటా సంస్థ ప్రయత్నిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం రాసింది.
ముస్లింలను టార్గెట్ చేసే రీతిలో దుర్భాషలాడుతూ కొన్ని యాడ్స్ ఫేస్బుక్లో దర్శనం ఇస్తున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. చీడ పురుగును కాల్చివేద్దాం , హిందువుల రక్తం చిందుతోంది, ఈ వలసవాదుల్ని తరిమేద్దాం అన్న స్లోగన్స్ ఎఫ్బీలో కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులపై తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు. ప్రతిపక్ష నేతను హతమార్చాలని, హిందువులను ఇండియా నుంచి వేరు చేయాలని ఆ నేతను ఉద్దేశిస్తూ ఓ పోస్టు చేశారని, దాని పక్కనే పాకిస్థాన్ జెండా ఉన్నట్లు కూడా యాడ్స్ను ప్రచారం చేస్తున్నట్లు నివేదికలో ఆరోపించారు.
విషపూరిత యాడ్స్ను క్రియేట్ చేసి మెటా యాడ్ లైబ్రరీకి అప్పగించారని, ఫేస్బుక్-ఇన్స్టాగ్రామ్ డేటాబేస్ నుంచి ఆ యాడ్స్ను పబ్లిష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా సివిల్ వాచ్ ఇంటర్నేషనల్, కార్పొరేట్ అకౌంటబులిటీ సంస్థ ఇకో ఆ యాడ్స్ను తప్పుపట్టింది.
రిపోర్టును తయారు చేసిన పరిశోధకులు మొత్తం 22 యాడ్స్పై స్టడీ చేశారు. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ భాషల్లో ఆ యాడ్స్ ఉన్నాయి. వాటిని మెటాకు అందజేశారు. దీంట్లో 14 యాడ్స్ను మెటా అప్రూవ్ చేసింది. అయితే ఏఐతో మ్యానిపులేట్ చేసిన ఇమేజ్లు ఉన్న యాడ్స్ను డిటెక్ట్ చేయడంలో మెటా సిస్టమ్స్ విఫలమైనట్లు తేలింది. ఏఐ ఆధారిత కాంటెంట్ను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు మెటా కంపెనీ చెబుతున్నా.. వాస్తవానికి ఆ యాడ్స్ను నియంత్రించడంలో ఆ కంపెనీ విఫలమైనట్లు తెలుస్తోంది.
విద్వేషపూరిత మెసేజ్లను వ్యాప్తి చేస్తూ మెటా సంస్థ లాభాలు పొందుతున్నట్లు ఇకో సంస్థ ప్రచారకర్త మొయిన్ హమ్మద్ తెలిపారు. ఎవరు ఎటువంటి యాడ్స్ ఇచ్చినా.. డబ్బు కోసం మెటా సంస్థ ఆ యాడ్స్ గురించి తెలుసుకోకుండానే పబ్లిష్ చేస్తున్నట్లు ఆరోపించారు. రాజకీయాలకు, ఎన్నికలకు సంబంధించిన యాడ్స్ను గుర్తించడంలోనూ మెటా విఫలమైనట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి మెటా పాలసీ ప్రకారం పొలిటికల్ యాడ్స్ను ముందుగా పరిశీలించిన తర్వాతే వాటిని ప్రచురణకు ఇవ్వాలి. కానీ దీనికి భిన్నంగా మెటా మార్కెటింగ్ నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కీలకమైన ఎన్నికల వేళ విష ప్రచారాన్ని, తప్పుడు సమాచారాన్ని అడ్డుకునే శక్తి మెటా వద్ద లేదని తేలినట్లు హమ్మద్ తెలిపారు. ఏఐ ఆధారిత ఇమేజ్లను కూడా మెటా గుర్తించలేకపోతున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. మెటా సంస్థను ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.