వినాయక్నగర్/ ఖలీల్వాడి, ఏప్రిల్ 28 : గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బంధువులు సదరు దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్భిణి కంఠం స్రవంతి (35) వీక్లీ మార్కెట్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యురాలికి చూపించుకున్నది. శనివారం ఉదయం సదరు దవాఖానలో హెల్త్ చెకప్ కోసం వచ్చింది. గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, హార్ట్ బీట్, శ్వాస సంబంధిత సమస్య ఉందని వైద్యులు గర్భిణికి సూచించారు. అబార్షన్కు సంబంధించిన మందులు ఇవ్వడంతో గర్భిణి, కుటుంబీకులు అవి తీసుకొని ఇంటికెళ్లారు.
మందులు వేసుకున్న అనంతరం గర్భిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కుటుంబీకులు ఆందోళనకు గురై దవాఖానకు ఫోన్ చేసి మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉదయాన్నే గర్భిణిని దవాఖానకు తీసుకురావాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం గర్భిణిని సదరు దవాఖానకు తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉన్నది, మరో దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక గర్భిణి బంధువులు మరో దవాఖానకు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన గర్భిణి కుటుంబీకులు, బంధువులు సదరు ప్రైవేట్ దవాఖాన ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే స్రవంతి మృతిచెందిందని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మధ్యవర్తుల ద్వారా బాధిత కుటుంబానికి దవాఖాన యాజమాన్యం నష్టపరిహారం చెల్లించడంతో వారు ఆందోళన విరమించారు.