డిస్పూర్ : అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడమే మరణాలకు కారణమని రోగుల బంధువులు ఆరోపించారు. మృతి చెందిన 12 మందిలో ఐసీయూలో ఉన్న తొమ్మిది మంది, వార్డులో ఉన్న ముగ్గురు రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అభిజిత్ శర్మ మంగళవారం తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగులకు కోమోర్బిడిటీస్ ఉన్నాయని, ఆక్సిజన్ స్థాయి అవసరమైన దానికంటే తక్కువ స్థాయికి పడిపోయి.. పరిస్థితి విషమించిన అనంతరం ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ శర్మతెలిపారు.
వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదని చెప్పారు. మృతుల్లో ఎవరూ ఒక్క మోతాదు వ్యాక్సిన్ తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని కోరారు. ప్రాణనష్టం జరుగకుండా ఉండేందుకు సాధ్యమైనంత తర్వగా ఆసుపత్రి, కొవిడ్ కేర్ సెంటర్లో చేరాలని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సుమారు 200 మంది వరకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి కేశబ మహంత ఆసుపత్రిని సందర్శించారు. పరిస్థితిపై సమీక్షించి, వైద్యులతో సమావేశమయ్యారు.