Saiyaara Team Reunite | బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి, యువ నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డాల కాంబినేషన్లో వచ్చిన ‘సయ్యారా’ (Saiyaara) చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే టీమ్ మరోసారి ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కోసం చేతులు కలిపారు. 2025లో విడుదలైన ‘సయ్యారా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.580 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో, అదే టీమ్ నుండి వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) బ్యానర్పై అక్షయ్ విదాని ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
మోహిత్ సూరి మార్క్ ఇంటెన్సివ్ ఎమోషన్స్ మరియు హృదయాన్ని హత్తుకునే సంగీతంతో సాగే ఈ ప్రేమకథా చిత్ర షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ, తన సక్సెస్ఫుల్ టీమ్తో మళ్లీ పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఈసారి అంతకంటే బలమైన కథతో ప్రేక్షకులను పలకరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జనరేషన్ జెడ్ (Gen Z) ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్ను 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో అహాన్ పాండే, అనీత్ పడ్డాల జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.