ప్రజాతీర్పును పరిహసిస్తున్న మోదీ సర్కారు
ఢిల్లీ చట్టం సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి
ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీని ఉసిగొల్పుతున్న కేంద్రం
అధ్వానస్థాయికి కేంద్రం-రాష్ట్ర సంబంధాలు
కాషాయపార్టీపై ఐక్యంగా పోరాడుదాం.. కలిసిరండి
సీఎం కేసీఆర్ సహా విపక్ష నేతలకు మమత లేఖ
న్యూఢిల్లీ/సింగూర్/గోఘాట్ (పశ్చిమబెంగాల్), మార్చి 31: భారత ప్రజాస్వామ్యంపై, సమాఖ్య నిర్మాణంపై కనీవినీ ఎరుగని దాడికి పాల్పడుతున్న బీజేపీపై పోరాడేందుకు కలసిరావాలని బీజేపీయేతర పార్టీలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సహా పలువురు కీలక విపక్ష నాయకులకు మమత ఈ మేరకు బుధవారం లేఖ రాశారు. బీజేపీ విధానాలను లేఖలో దుయ్యబట్టారు. ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే (ఎల్జీ)నని పేర్కొంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం ‘ప్రమాదకర పరిణామం’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను ఈ చట్టం ద్వారా కేంద్రం లాగేసుకుని, తన నామినీ అయిన ఎల్జీకి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. తద్వారా అప్రకటిత వైస్రాయ్గా ఎల్జీ మారిపోయారని.. ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తారన్నారు. ఢిల్లీలో 2014,19 ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైనా, ప్రజాతీర్పును అంగీకరించేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదన్నారు. ఎల్జీ ద్వారా ఢిల్లీపై పెత్తనం సాగించాలని చూస్తున్నదన్నారు.
విపక్ష పాలిత రాష్ర్టాలకు నిధులివ్వని కేంద్రం..
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీయేతర నాయకులపై నిస్సిగ్గుగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మమత ఆరోపించారు. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ర్టాలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదన్నారు. జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం వంటి సంస్థలను రద్దుచేసి, నీతి ఆయోగ్ను ఏర్పాటుచేయడం ద్వారా.. రాష్ర్టాలు తమ అవసరాలు, డిమాండ్లు, ఆందోళనలను కేంద్రం ఎదుట వినిపించే వేదికలను మోదీ సర్కారు నిర్వీర్యం చేసిందని విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చి, ఆయా పార్టీల నాయకులను ఫిరాయింపులకు పాల్పడేలా బీజేపీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాష్ర్టాల అధికారాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చుతున్నదని ఆరోపించారు. దేశంలో ఏకపార్టీ వ్యవస్థను నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు