ముంబై: దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేస్తున్నామని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. అయితే ప్రభుత్వ, మున్సిపల్ దవాఖానల్లో వ్యాక్సినేషన్ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది.
వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రైవేట్ దవాఖానల్లోని టీకా కేంద్రాలు శని, ఆది, సోమ వారాల్లో పనిచేయవని బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కకానీ తెలిపారు. కాగా, నిన్న రాత్రి ప్రభుత్వ టీకా కేంద్రాలకు 99 వేల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయని దీంతో శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీకాలు పంపిణీ చేస్తారని తెలిపారు.
ముంబైలో 49 ప్రభుత్వ, 71 ప్రైవేటు టీకా కేంద్రాలను బీఎంసీ ఏర్పాటు చేసింది. వీటిలో ప్రతిరోజు 40 వేల నుంచి 50 వేల మందికి టీకాలు ఇస్తారు. రాష్ట్రంలో నిన్న 58,993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 301 మంది మరణించారు. ఇందులో పుణేలో అత్యధికంగా 10,084, ముంబైలో 9,200 కేసులు రికార్డయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..