మోతె, ఆగస్టు 12 : గుర్తు తెలియని వ్యక్తుల భార్యాభర్తలను హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి పక్కన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మోతె మండలం బీక్య తండాకు చెందిన హలావత్ నాగులు(48), హలావత్ బూబ(45) భార్యాభర్తలు. మోతె గ్రామంలో కిరాయి ఇంట్లో ఉంటూ బొక్క సతీశ్రెడ్డికి సంబంధించిన వ్యవసాయ భూమిని కౌలుకు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి భార్యాభర్తలను హత్య చేసి కాళ్లు చేతులు కనిపించేలా భూమిలో పాక్షికంగా పాతిపెట్టి వదిలేసి వెళ్లిపోవడం కలకలరేపింది.
స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ లచ్చిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూమిలో పాతపెట్టిన మృతదేహాలను వెలికి తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ నిందితులను త్వరలో పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.