న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 2,66,207 మంది బాధితులు మృతిచెందారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3,53,299 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 18,04,57,579 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది.
కాగా, దేశంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 31,30,17,193కు చేరిందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒకేరోజు 16,93,093 మందికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి