Retired Employees | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగులు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగులు నాడు ఉద్యోగులుగా ఉంటూ కీలక భూమిక పోషించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలోనూ వారు తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. అలాంటి విశ్రాంత ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు క్రూరమైంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నేతలు అనేక హామీలు గుప్పించారు. జీతాలు ప్రతి నెలా 1వ తేదీన చెల్లిస్తామని, డీఏలను వెంటనే చెల్లిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికొదిలేశారు.
రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రూ.6 వేల కోట్ల నిధులు, ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కానీ, నెలలు, ఏండ్లు గడుస్తున్నా ఆ బకాయిలను విడుదల చేయాలన్న సోయి సర్కార్కు ఏమాత్రం రావడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. విద్య, వైద్యం, రవాణా ఖర్చులు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను నిలిపివేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలతో జీవించిన వారి కుటుంబాలు రోజువారీ ఖర్చులకు సైతం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
తమకు హక్కుగా రావాల్సిన పెండింగ్ బకాయిలపై రిటైర్డ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నదని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్రెడ్డి దిగజారి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చేశారు. తెలంగాణ ప్రజాధనం వెచ్చించి, ఇతర రాష్ర్టాల ఎన్నికల ప్రచారాల కోసం రాహుల్ గాంధీకి హెలికాప్టర్ సమకూర్చారు. కానీ, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి మాత్రం నిధులు ఉండవా? ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఇంట్లో పిల్లలతో శేషజీవితం గడపాల్సినవారు, హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆరోగ్యం సహరించకున్నా రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దయనీయ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది.
రిటైర్డ్ ఉద్యోగుల్లో అనేకమంది దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడుతున్నారు. బీపీ, షుగర్ పెరిగి జీవశ్ఛవాల్లా జీవిస్తున్నారు. వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగి ఆర్థిక భారం భరించలేక సతమతమవుతున్నారు. వేతనాల నుంచి నెలనెలా కోతపెట్టినప్పటికీ ఈహెచ్ఎస్ కింద హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు డబ్బుల్లేక ఆఖరికి ఆపరేషన్లు సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉన్నది. అదే జరిగితే ఉద్యోగులు, పెన్షనర్లు తమకు రావాల్సిన వేలాది రూపాయల బకాయిలను కోల్పోతారు. ఇది ముమ్మాటికీ వారి హక్కులను హరించడమే అవుతుంది. కనుక, రాష్ట్ర పురోగతిలో భాగస్వాములై తమ సర్వస్వం అర్పించిన రిటైర్డ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
– వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి