హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఔటర్రింగ్ రోడ్డు వైపు నుంచి వచ్చే బస్సులను నగరంలోకి రాకుండా టెర్మినల్స్ వరకే నడిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, నగరానికి వచ్చే అంతర్ జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి, అకడి నుంచి ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నదని తెలిపారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై దృష్టి సారించామని వెల్లడించారు. ఆయా టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బీసీ సంక్షేమశాఖ బీసీ మహిళల కోసం కుట్టుమిషన్ల పంపిణీ పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్టు తెలిపారు. 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు కుట్టుమిషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు వెల్లడించాయి.