Bhagyashri Borse | టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యువ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. అఖిల్ అక్కినేని సరసన నటించిన ‘లెనిన్’ సినిమా బ్లాక్బస్టర్ విజయంతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిన ఈ పూణే భామ, ఇటీవల ఓ కాలేజీలో నిర్వహించిన ఇంటరాక్టివ్ టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచే నటనపై తనకు అమితమైన ఆసక్తి ఉండేదని భాగ్యశ్రీ తెలిపారు. అయితే సినిమాల్లోకి రావాలన్న తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు మొదట అస్సలు అంగీకరించలేదని చెప్పారు.
జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలకు చివరికి మనమే బాధ్యత వహించాలి. ఇతరుల కోసం మన కలలను వదులుకుంటే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అందుకే నటిగా మారాలనుకుంటున్నానని ముందుగా అమ్మకు చెప్పాను. కానీ ఆమె వెంటనే ‘వద్దు’ అని చెప్పింది. తర్వాత నాన్నతో మాట్లాడితే, ‘అమ్మ వద్దన్న పని నువ్వెలా చేస్తావు?’ అని అడిగారు. కనీసం అక్క అయినా నాకు మద్దతు ఇస్తుందనుకున్నా, ఆమె కూడా అమ్మానాన్నల మాటే వినాలని చెప్పింది. ఇంట్లో అందరూ నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు” అని ఆమె గుర్తు చేసుకున్నారు.కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైనా తన కలను వదులుకోలేదని భాగ్యశ్రీ చెప్పారు. నేను ఆడిషన్స్కు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో పరిస్థితి మరింత కఠినంగా మారింది. నా నిర్ణయం నచ్చక అమ్మ దాదాపు ఆరు నెలల పాటు నాతో మాట్లాడలేదు. అంతేకాదు, వాట్సాప్లో కూడా నన్ను బ్లాక్ చేసింది.
ఇప్పుడు ఆ విషయాలను నవ్వుకుంటూ చెప్పగలుగుతున్నా… ఆ రోజుల్లో మాత్రం చాలా బాధపడ్డాను. అయితే తల్లిదండ్రులకు సినిమా పరిశ్రమపై కొన్ని భయాలు ఉండటం సహజం. అందుకే వారు అలా స్పందించారు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాలను అధిగమించి సినీ రంగంలో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే, రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్డమ్’, రామ్ పోతినేనితో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, దుల్కర్ సల్మాన్తో ‘కాంత’ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నారు. అయితే అఖిల్ అక్కినేనితో చేసిన ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. ఇందులో ‘భారతి’ పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి.