CPM Sarpanches | రామన్నపేట, సెప్టెంబర్ 20 : రామన్నపేట నుంచి పల్లెపహాడ్ వరకు ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై, అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారినా ప్రభుత్వం, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక, మునిపంపుల గ్రామాల సర్పంచులు వినూత్న నిరసన చేపట్టారు.దుబ్బాక గ్రామంలో రోడ్డుపై ఏర్పడిన నీటి గుంతల్లో కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ.. రామన్నపేట–పల్లెపహాడ్ రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరిందన్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వర్షాలు కురిసినప్పుడు వాటిలో నీరు నిలవడంతో గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతిరోజూ ఈ రహదారి మీదుగా అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని, రహదారి దుస్థితి కారణంగా ప్రయాణ సమయం పెరగడంతోపాటు వాహనాలు దెబ్బతింటున్నాయని అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లే రోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డంతా ధ్వంసమై ప్రజల ప్రయాణాలు నరకప్రాయంగా మారుతున్నా, కనీసం తాత్కాలికంగా గుంతలను పూడ్చేందుకు తట్టెడు మట్టి కూడా పోయలేని స్థితిలో ఆర్&బీ అధికారులు వ్యవహరించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే వరకు అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ఇంత తీవ్రమైన సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా కళ్లు తెరిచి రహదారి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.
అధికారులు కాలయాపన చేయకుండా..
మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా మాట్లాడుతూ.. రామన్నపేట–పల్లెపహాడ్ రహదారి దుస్థితిపై సంబంధిత అధికారులకు పలుమార్లు సమస్యను తెలియజేసినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా రహదారిని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ముందుగా ప్రమాదాలను నివారించేందుకు రోడ్డుపై ఉన్న అన్ని గుంతలను తక్షణమే పూడ్చాలని, అనంతరం పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి నాణ్యమైన రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు. రహదారి మరమ్మతుల విషయంలో అధికారులు కాలయాపన చేయకుండా అత్యవసర చర్యల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని సీపీఎం సర్పంచులు హెచ్చరించారు.
ప్రజల భద్రతకు సంబంధించిన ఈ సమస్యను ప్రభుత్వం ఇకనైనా అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి నగేష్, జంపాల అండాలు, మండల కమిటి సభ్యులు తొలుపునూరి శ్రీనివాస్, మేడి గణేష్, పల్లివాడ ఉప సర్పంచ్ పావిరాల మత్స్యగిరి, శాఖ కార్యదర్శి తాళ్లపల్లి జితేందర్,నాయకులు తొలుపునూరి చంద్రశేఖర్,పుట్టల ఉదయ్ కుమార్, గంటెపాక శివ కుమార్, దండిగ నర్సింహా,ఉండ్రాతి నర్సింహా, జోగుల శ్రీనివాస్, గాదె పరమేష్, మేడి భాషయ్య, వేముల మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం కార్యకర్తలు, దుబ్బాక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
