తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో ఆరో రోజు ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి ( Malayappa Swamy ) కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తులు భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ మాడవీధుల్లో స్వామివారు విహరించారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శనివారం స్వామివారిని 83,589 మంది భక్తులు దర్శించుకోగా 27,828 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.17 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. 4.77 లక్షల లడ్డూలను విక్రయించగా 7.04 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.