Indian Sailors : ఉక్రెయిన్ (Ukraine) లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చోర్నోమోర్స్క్ పోర్టు (Chornomorks Port) పరిసరాల్లో డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. దాంతో పోర్టులోని ఒక కార్గో నౌక (Cargo ship) లో 13 మంది భారత నావికులు (Indian Sailors) సహా మొత్తం 15 మంది సిబ్బంది చిక్కుకుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరులో భాగంగా నల్లసముద్రం సమీపంలో నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో కార్గో నౌకలో చిక్కుకున్న భారతీయులు తీవ్ర ప్రాణ భయంతో ఉన్నారని ‘ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (FSUI) ఆందోళన వ్యక్తంచేసింది. ‘ఎంవీ అమీర్1’ అనే నౌక భయంకరమైన, ప్రాణాంతక పరిస్థితుల్లో చిక్కుకుందని ఎఫ్ఎస్యూఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. ‘నౌక సమీపంలో పదేపదే డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా నౌకపై నేరుగా దాడి జరగవచ్చనే భయంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు’ అని యూనియన్ పేర్కొంది.
సిబ్బందిని తక్షణమే కాపాడి వారిని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వం.. నౌక యాజమాన్యం, ఇతర అధికారులను కోరింది. సంఘర్షణ ప్రాంతాల్లో భారత నావికులను లక్ష్యాలుగా వదిలేయవద్దని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నౌక పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంటున్న దృశ్యాలతో కూడిన ఒక వీడియోను కూడా పంచుకుంది. ఇటీవలి కాలంలో నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు పెరిగాయి. గత వారం జరిగిన దాడిలో ఒక భారత నావికుడు మరణించిన ఘటనపై భారత్ సోమవారం తీవ్రంగా స్పందించింది.
ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పాలిష్చుక్ను పిలిపించి వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గట్టిగా నిరసన తెలియజేసింది. ఎంవీ ఒమోర్ఫీ అనే నౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా 13 మంది నావికులు చిక్కుకున్న ఘటనపై భారత విదేశాంగ శాఖగానీ, సంబంధిత షిప్పింగ్ కంపెనీగానీ ఇప్పటివరకు స్పందించలేదు.