న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసుల పట్ల ఓ జంట దురుసుగా ప్రవర్తించింది. కరోనా నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులపై ఆ జంట రుసరుసలాడింది. నా భర్తను నేను ముద్దుపెట్టుకుంటాను.. మీరు నన్ను ఆపగలరా..? అంటూ ఏకంగా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన ఢిల్లీలోని దరియాగంజ్ ఏరియాలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు చోటు చేసుకోగా, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఢిల్లీకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు.. తమ కారులో రోడ్డుపైకి వచ్చారు. దరియాగంజ్ ఏరియాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆ దంపతులిద్దరూ మాస్కులు ధరించకపోవడంతో వారిని ఆపి ప్రశ్నించారు. కారులో ప్రయాణించినప్పటికీ.. కరోనా వ్యాప్తి దృష్ట్యా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. కారులో ఒక్కరు వెళ్లినా మాస్కు ధరించాలని కోర్టు ఆదేశించిందని వారికి పోలీసులు చెప్పారు. అవేమీ వినిపించుకోకుండా ఆ దంపతులిద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా భర్తను నేను ముద్దుపెట్టుకుంటాను.. మీరు నన్ను ఆపగలరా..? అంటూ సదరు మహిళ పోలీసులను ప్రశ్నించింది. నా భార్యతో కారులో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపారు? అని అతను ప్రశ్నించాడు.
మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారు యజమాని పంకజ్ దత్తాను అరెస్టు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే పంకజ్ను అరెస్టు చేశామన్నారు. ఆమెను కూడా అరెస్టు చేస్తామన్నారు. శని, ఆదివారాల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 569 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. 2,369 మంది నుంచి చలాన్లు వసూలు చేశామని పోలీసులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో 323 మందిని అరెస్టు చేశామన్నారు.
ఇవి కూడా చదవండి..