హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వమందించే ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004 మందిని సాయం కోసం ఎంపికచేశారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఈ సంఖ్య మరో 10వేల వరకు పెరిగే అవకాశమున్నట్టు అధికారులు అంచనావేస్తున్నారు. ఎంపికైన వారికి మంగళవారం నుంచి రూ.2వేల నగదు సాయం అకౌంట్లలో జమ చేయనుండగా.. 21వ తేదీ నుంచి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2వేల నగదు, 25 కిలోల బియ్యం అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. జిల్లాలవారీగా ఎంపిక చేపట్టి కలెక్టర్ల ఆమోదం తీసుకున్నారు. జాబితాను విద్యాశాఖ డైరెక్టరేట్కు పంపించారు. అదే జాబితాను ఆర్థికశాఖకు పంపించనున్నారు. నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధంచేసింది.
రేపటి నుంచి ఖాతాల్లోకి రెండువేలు..
33 జిల్లాల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు పంపించిన దరఖాస్తుదారుల జాబితా ఆదివారానికి విద్యాశాఖ డైరెక్టరేట్కు చేరింది. లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ ఖాతా, ఆధార్, ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను విద్యాశాఖ డైరెక్టరేట్కు అందజేశారు. ఈ జాబితాను సోమవారం ఆర్థికశాఖకు పంపించనున్నారు. ఆర్థికశాఖ ఆమోదంపొందాక మంగళవారం నుంచి రూ. 2వేల నగదును బ్యాంక్ ఖాతాలో జమచేయనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు ఆర్టీజీఎస్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. కాగా, ఈ నెల 21- 25 వరకు బియ్యం పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ లబ్ధిదారులందరికీ 25 కిలోల సన్నబియ్యాన్ని అందజేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విష యం తెలిసిందే. టీచర్లు, సిబ్బంది దరఖాస్తుల్లో పొందుపరిచిన రేషన్షాపుల్లోనే బియ్యాన్ని ఈ అందజేస్తారు.
వెబ్సైట్లో జాబితా..
ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేపట్టిన అధికారులు ఆదివారం రాత్రి వరకు తుది జాబితాను సిద్ధంచేశారు. ఐదు రోజులుగా ప్రత్యేక బృందాలను నియమించి, మొత్తం 2,06,345 దరఖాస్తులను వడబోసిన అధికారులు జిల్లాలవారీగా లబ్ధిదారులను ఎంపికచేశారు. వీరిలో బోధనా 1,53,525.. బోధనేతర సిబ్బంది 52,820 ఉన్నారు. 1,18,004 మందితో కూడిన ఈ జాబితాను https:/schooledu.telangana.gov. in లో ఉంచారు. ఈ జాబితాను లాగిన్ఐడీ, పాస్వర్డ్ల ఆధారంగా చూసుకునే అవకాశం కల్పించారు. డీఈవో ఆఫీసు లు, ఆయా పాఠశాలల్లో జాబితాను ప్రదర్శించనున్నారు.