శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకైన శ్రీశైల (Srisailam) క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవంలో భాగంగా అమ్మవారికి గుమ్మడి కాయలు, నిమ్మకాయలు సాత్విక బలిగా సమర్పిస్తారు. కార్యక్రమం సందర్భంగా ఆలయానికి నిమ్మకాయలతో అలంకరణ చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
ఉదయం 7.30 గంటలకు మొదటి విడుత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాలు సమర్పించారు. సాయంత్రం స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతి సమర్పించనున్నారు. ఆ తర్వాత పలు రకాల వంటలతో మహా నివేదన చేయనున్నారు. స్త్రీ వేషధరణలో ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇస్తారు. ఈ సందర్భంగా ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. హారతి అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కల్యాణోత్సవం, ఏకాంత సేవలను అధికారులు నిలిపివేశారు.