న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లివచ్చినవారు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కుంభమేళా నుంచి ఢిల్లీకి వచ్చినవారు 14 రోజులపాటు తప్పనిసరిగా హోంక్వారంటైన్లో ఉండాలని విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 4 నుంచి ఇప్పటివరకు వెళ్లివచ్చినవారు లేదా నేటి నుంచి ఈనెల చివరి నాటికి కుంభమేళాకు వెళ్లివచ్చేవారు 24 గంటల్లోగా వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని అందులో పేర్కొంది. ఒకవేళ కుంభమేళాకు వెళ్లినప్పటికీ సమాచారం అందించలేదని తెలిసినట్లతే ప్రభుత్వ క్వారంటైన్కు తరలిస్తామని వెల్లడించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలనే జారీచేసింది. కుంభమేళాకు వెళ్లివచ్చినవారిని క్వారంటైన్కు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కుంభమేళా నుంచి వచ్చినవారు వారి వివరాలను అధికారులకు సమాచారం అంచించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాలు కూడా కుంభమేళా యాత్రికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేశాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..