హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల్లో రాష్ట్రంలో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాసరావు హెచ్చరించారు. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజలు ఎవరికివారు సెల్ఫ్ లాక్డౌన్(స్వీయ నిర్బంధం) విధించుకోవాలని సూచించారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో కలిసి శనివారం కోఠిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతున్నదని చెప్పారు. ఏప్రిల్ 1న 1.63 శాతం ఉన్న పాజటివిటీ రేటు..15నాటికి 3.52 శాతానికి చేరిందని, కేవలం 15 రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ, 80 శాతం మందిలో వ్యాధి లక్షణాలు ఉండటం లేదని, 12 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. వైరస్ సోకిన 92 శాతం మందికి దవాఖానలో చికిత్స అవసరం ఉండటం లేదని చెప్పారు. వారు ఇంట్లో లేదా కోవిడ్ కేర్ సెంటర్లో ఉండి కోలుకుంటున్నారని అన్నారు. కేవలం 7-8శాతం మందికి మాత్రమే దవాఖానలో చికిత్స అవసరమవుతున్నదని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో మొత్తం 53వేల పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 122 దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమిడిస్విర్ సహా చికిత్సకు ఉపయోగపడే ఏ అంశాల్లోనూ కొరత లేదని స్పష్టంచేశారు. దవాఖానలో చేరాలా వద్దా అన్న దానిపై ప్రజలు వైద్యుల సూచనలు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో కేవలం 2లక్షల వ్యాక్సిన్ నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి మరొక రోజుకు మాత్రమే సరిపోతాయని చెప్పారు. ఆదివారం మరో 2.7లక్షల డోసులు వస్తాయని కేంద్రం నుంచి సమాచారం ఉన్నదని తెలిపారు.
ప్రజలు పాఠాలు నేర్వలేదు
కరోనా తొలిదశ నుంచి ప్రజలు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని, వైరస్ వెళ్లిపోయిందన్న భ్రమలో ఉన్నారని డాక్టర్ జీ శ్రీనివాసరావు చెప్పారు. వైరస్ బలం పుంజుకొందని, మ్యుటేషన్ల కారణంగా తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. సెకండ్ వేవ్లో వైరస్ వచ్చిందని ఒక్కరిలో గుర్తించేలోపే వారి కుటుంబం మొత్తానికి అంటుతున్నదని చెప్పారు. శుభకార్యాలు, పండుగలు, ఎన్నికల వేళ ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితేనే బయటికి వెళ్లాలని సూచించారు. ‘ఈ మధ్య ఉత్సవం చేసుకొనేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాకు 20 మంది వచ్చారు. వీరితో మనవాళ్లు మరో 30 మంది కలిసి ఉత్సవం జరిపారు. కొద్దిరోజుల తర్వాత వాళ్లలో ఐదుగురు పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ఈ ఐదుగురిని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే 34 మంది, ఇలా కేవలం 12 రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాల్లోని 433 మందికి వైరస్ సోకింది. కేవలం 20 మందితో మొదలై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.’ అని శ్రీనివాసరావు వివరించారు.
ఇండ్లల్లో నిల్వ దారుణమైన చర్య
వైరస్ సోకనివారు, పాజిటివ్ వచ్చినా అవసరం లేనివారు ఆక్సిజన్ సిలిండర్లను, రెమ్డెసివర్ ఇంజెక్షన్లను ఇండ్లలో నిల్వ చేసుకుంటున్నారని, ఇది దారుణమైన చర్య అని డాక్టర్ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రెమ్డెసివర్ ఇంజెక్షన్ దివ్యౌషధం కాదని, ఇష్టారీతిగా వాడితే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి ఏ మందు అవసరమో, ఆక్సిజన్ అవసరమో వైద్యులు మాత్రమే నిర్ధారించి చికిత్స అందిస్తారని చెప్పారు. ఎలాంటి సమాచారం, ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు 104కు ఫోన్ చేయాలని సూచించారు.
స్పానిష్ ఫ్లూ దీనస్థితి మనకు వద్దు
దాదాపు వందేండ్ల కిందట స్పానిష్ ఫ్లూ తొలిదశ నుంచి ప్రపంచం ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని, అందుకు భారీ మూల్యం చెల్లించిందని శ్రీనివాసరావు గుర్తుచేశారు. స్పానిష్ ఫ్లూ మొదటి దశలో ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల నుంచి 5లక్షల మంది వరకు మృతిచెందారని, రెండో దశలో 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రాణాలు వదిలారని చెప్పారు. ఇప్పుడు కరోనా విషయంలో అదే అనుభవం ఎదురవుతున్నదని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం చూపించకూడదని సూచించారు. ‘నేను నేనూ మా కుటుంబంలో ఒకరిని కోల్పోయాను. అలాంటి పరిస్థితి ఎవరికి రావొద్దు’ అని శ్రీనివాసరావు ఆవేదనతో అన్నారు.
రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదు
రాష్ట్రంలో ఆక్సిజన్, వైద్య సిబ్బంది, రెమ్డెసివర్ సహా ఏ ఇతర మందులకూ కొరత లేదని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు పారిశ్రామిక వినియోగాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రైవేటు యాజమన్యాలు స్వార్థపూరిత ఆలోచనలు పక్కనపెట్టి, ప్రజలకు సేవచేసే ధోరణిలో వ్యవహరించాలని చెప్పారు. ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలుండగా ప్రైవేటుకు వెళ్లి ప్రజలు జేబులు ఖాళీ చేసుకోవద్దన్నారు.
వైద్యారోగ్య శాఖ వద్ద నిల్వలు..
పడకలు : 53వేలు
ఎన్95 మాస్కులు : 7.58లక్షలు
పీపీఈ కిట్స్ : 5.80లక్షలు
3-ైప్లె మాస్క్స్ :65.19లక్షలు
ఆర్టీపీసీఆర్ కిట్లు : 1.41లక్షలు
ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు : 3.15లక్షలు
హోం ట్రీట్మెంట్ కిట్లు : 3.90లక్షలు
రెమ్డెసివర్ : 16,035
ప్రైవేటు దవాఖానల తీరు మారాలి
వివిధ దవాఖానల్లో చేరి ప్రాణాపాయస్థితికి చేరుకున్న తరువాత రోగులు గాంధీ దవాఖానకు వస్తున్నారు. దీంతో గాంధీలో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రైవేటు దవాఖానలు కొద్దిరోజులు తమ వద్ద ఉంచుకొని ఫీజులు వసూలుచేసి, చివరి దశలో వారి దవాఖానకు చెడ్డ పేరు రావొద్దని గాంధీకి పంపడం సరైన పద్ధతి కాదు. వైరస్ ఎక్కువగా ఉన్న 2020లో ఉన్న మరణాల కంటే, వైరస్ లేని ఏడాది 2019లోనే గాంధీలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. పూర్తిస్థాయిలో గాంధీ దవాఖాన కొవిడ్ చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నది.
-డాక్టర్ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్