ఆహారంలో పురుగులు వస్తున్నాయని.. ఇక్కడ ఉండలేమంటూ ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ నుంచి పారిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీవీబీ) నుంచి అర్ధరాత్రి గోడదూకి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.
శనివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ ప్రహరీ గోడ దాటి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, పోలీసులు, తల్లిదండ్రులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం గోవిందాపూర్ వెళ్లే మార్గంలోని చెట్ల పొదల్లో దాక్కున్న విద్యార్థినులను తల్లిదండ్రులు గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.
విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్లో అందించే అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని, బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, కొద్దిసేపు ఆలస్యంగా నిద్ర లేస్తే కఠినమైన శిక్షలు విధిస్తున్నారని వాపోయారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండలేకనే బయటకు వచ్చామని వారు తెలిపారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్, సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థినులు గోడ దూకి బయటకు వెళ్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీశారు. హాస్టల్లో ఆహారం, పారిశుద్ధ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.