న్యూఢిల్లీ : ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నరేంద్ర కోహ్లీ (81) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అవిభక్త భారత్లోని పంజాబ్ (ఇపుడు పాక్)లోని సియాల్కోట్లో 1940, జనవరి 6న జన్మించిన ఆయన హిందీ సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు. డీయూలోని మోతీలాల్ నెహ్రూ కళాశాలలో హిందీ ప్రొఫెసర్గానూ సేవలందించారు. సాహిత్యరంగంపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ‘జంగిల్ స్టోరీ, ప్రిజనర్, ప్రీతికథ, ఆత్మన్, ఆపర్చునిటీ, వార్, మై ఓన్ వరల్డ్’తో పాటు సుమారు వందకుపైగా రచనలు చేశారు.
భారతీయ పురాణ పురుషుడు రాముడిపై ఆయన చేసిన రచనలు ప్రాచుర్యం పొందాయి. రాముడిపై చేసిన రచనలతో నరేంద్ర కోహ్లీ అభినవ తులసీదాస్గా పేరుపొందారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులను అందుకోగా.. 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. నరేంద్ర కోహ్లీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘కోహ్లీ మరణంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాను. పౌరాణిక, చారిత్రక పాత్రలను సజీవంగా చిత్రీకరించిన ఆయనను సాహిత్య రంగం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..