MLA kotha Prabhakar Reddy | తొగుట, ఆగస్టు 04 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతుంది. వ్యవసాయమే జీవనమైన మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఉప కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇర్కోడు పైపుడ్ ఇరిగేషన్ కు సంబంధించి ఎల్లారెడ్డిపేటలోని మినీపంప్ హౌజ్ పనులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పరిశీలించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం నాలుగేళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మొదలుకొని కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు పనులు పూర్తి చేయడం జరిగిందని, రేవంత్ సర్కార్ మాత్రం రెండేళ్లలో పూచిక పుల్లంత పని కూడా చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇర్కోడ్ పైపుడ్ ఇరిగేషన్కు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 గ్రామాల రైతులు ఆందోళన చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తద్వారా 21 గ్రామాల్లో 17385 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
రెండేళ్లయినా సాగునీళ్లు వచ్చే పరిస్థితి లేదు..
ఎల్లారెడ్డిపేటలోని ఫైపుడ్ ఇరిగేషన్ నెట్వర్క్ మినీ పంప్ హౌజ్ను ఎల్లారెడ్డిపేట వద్ద గల అధికారులతో తాము సమీక్ష నిర్వహించినా పనులు నత్తనడకన సాగుతున్నాయని, బిల్లులు తీసుకొని పనిచేయడం లేదన్నారు. ఎల్లారెడ్డిపేటలోని మినీ పంప్ హౌజ్ సబ్ స్టేషన్, పంప్ వ్యవస్థ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లులో పనిచేసినట్లు నలుగురు కార్మికులతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలా పనులు సాగితే రెండేళ్లయినా సాగునీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు దుబ్బాక నియోజకవర్గం అంటేనే వ్యవసాయ ఆధార నియోజకవర్గమని, సాగునీళ్లు లేకుంటే వ్యవసాయం సాగదన్నారు.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంపై దృష్టి సారించాలని, పెండింగ్లో ఉన్న ఉప కాలువలను వెంటనే పూర్తిచేయాలని, పైపుడ్ ఇరిగేషన్ నెట్వర్క్ పూర్తి చేయాలని ఆయన కోరారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషప్రచారం మానుకొని మల్లన్నసాగర్లోకి నీళ్లు వచ్చేలా చూడాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల మూలంగా పంటలు ఎండిపోతున్నాయని, మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. సాగునీటి సమస్యపై ప్రభుత్వం స్పందించని పక్షంలో దుబ్బాక నియోజకవర్గ రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
కుర్మ యాదగిరికి ఎమ్మెల్యే పరామర్శ..
తొగుట సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. యాదగిరి తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న వారు యాదగిరిని కలిసి మనోధైర్యం అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, దుబ్బాక పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణాగౌడ్, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, వెల్బుల స్వామి, కలీమోద్దీన్, బొదనం కనకయ్య, చేపూరి శేఖర్ గౌడ్, కొమ్ము శరత్, మంగ నర్సింహులు, మధుసుధన్ రెడ్డి,, రాజిరెడ్డి, రాజశేఖర్, బైరాగౌడ్, పులిరాజు, నరేందర్ గౌడ్, వెంకట్ గౌడ్, అశోక్, మంగలి యాదగిరి తదితరులు ఉన్నారు.
Kollapur | ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా కొల్లాపూర్లో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో
Veerabhadram | దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలి : తమ్మినేని వీరభద్రం
Juluruapadu : మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాపట్ల మురళి