Harish Rao | సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 8: జహీరాబాద్ మైనార్టీ బిడ్డలు 50 మంది డాక్టర్లు అయ్యారంటే అది కేసీఆర్ చలవేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఇంటి బిల్లులు ఆపుతామని బెదిరిస్తే.. ఇక్కడే కుర్చీ వేసుకొని శాంక్షన్ చేయించే బాధ్యత నాది. నిధులు ఎవరి జాగీర్ కాదు.. ఫైనాన్స్ కమిషన్ నుంచి నేరుగా మున్సిపాలిటీలకు వస్తాయి. కేసీఆర్ ను తిడితే మీకు కడుపు నిండదు.. రైతుబంధు వేస్తే రైతుల కడుపు నిండుతుంది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధిని, సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కోహిర్ అభివృద్ధి చెందాలంటే కారు గుర్తు గెలవాలి. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో చేశారన్నారు.
జహీరాబాద్, కోహిర్ ప్రాంతాల్లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి నాణ్యమైన విద్యను అందించాం. అందుకే జహీరాబాద్ తాలూకా నుంచి 50 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించి డాక్టర్లు అయ్యారు. ఇది కేసీఆర్ విజయం కాదా..? ఇమామ్ లకు, మౌజంలకు నెలనెలా గౌరవ వేతనం ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ అని స్పష్టం చేశారు.
ఆ బాకీ తీర్చాకే ఓట్లు అడగాలి…
పేద ముస్లింలు పండుగ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇస్తే.. రేవంత్ రెడ్డి దాన్ని బంద్ పెట్టాడు.గతంలో రూ. 200 ఉన్న పెన్షన్ ను రూ. 2000 చేసింది కేసీఆర్. కాంగ్రెస్ వాళ్లు వచ్చి రూ. 4000 ఇస్తామన్నారు..ఇచ్చారా..? ఈ రెండున్నరేళ్లలో ఒక్కో అవ్వకు, తాతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 52,000 బాకీ పడింది.ఆ బాకీ తీర్చాకే ఓట్లు అడగాలి. మహిళలకు రూ. 2500 ఇస్తామని మోసం చేశారన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఇంటి బిల్లులు రావు, పర్మిషన్లు రావని బెదిరిస్తున్నారట. ఇదేమైనా మీ అబ్బ జాగీరా?నేను చెప్తున్నా.. కోహిర్ లో కారు గుర్తును గెలిపించండి. ఇక్కడే కుర్చీ వేసుకొని కూర్చుని మీ ఇంటి బిల్లులు ఇప్పించే బాధ్యత నాది. మీ జోలికి ఎవరు వస్తారో నేను చూస్తా.ఓటేస్తేనే మున్సిపాలిటీలకు నిధులు ఇస్తామని బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన.
మున్సిపాలిటీలకు నిధులు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుండి జనాభా ప్రాతిపదికన నేరుగా వస్తాయి. అవి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండవని హరీష్ రావు తెలిపారు.కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 12 గంటలే ఇస్తున్నాడు. రైతులను మళ్ళీ యూరియా బస్తాల కోసం క్యూ లైన్లలో నిలబెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. .
కాంగ్రెస్ వచ్చాక అన్నీ బంద్..
ఫిబ్రవరి వచ్చినా యాసంగి రైతుబంధు పడలేదు. ఇప్పటికే రెండు రైతుబంధులను ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టికొట్టారు.రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు కానీ బూతులు మాత్రం బాగా వచ్చు. నన్ను, కేసీఆర్ను, కేటీఆర్ను బూతులు తిడితే పేదోడి కడుపు నిండుతుందా..?అదే రైతుబంధు వేస్తే రూ. 15,000 వస్తాయి.. రైతుల కడుపు నిండుతుంది. రేవంత్ రెడ్డి బూతులు మానేసి పాలన మీద దృష్టి పెట్టాలి.కాంగ్రెస్ వచ్చాక అన్నీ బంద్ అయ్యాయి. కేసీఆర్ కిట్ బంద్, దళిత బంధు బంద్, బీసీ బంధు బంద్, గొర్రెల పంపిణీ బంద్. కోహిర్ లో 50 పడకల ఆసుపత్రి కట్టించింది, ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చింది కేసీఆరే.
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. మీకు ఆపదలో, కష్టాల్లో ఎప్పుడూ తోడుంటారు. అలాంటి నాయకుడి గౌరవం కాపాడాలి. కారు గుర్తు అభ్యర్థులను గెలిపించండి. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే.. కోహిర్ అభివృద్ధిని మళ్లీ పరుగులెత్తిద్దామని పిలుపునిచ్చారు.

Zhbd
Nizampet | నిజాంపేటలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు
Madhya Pradesh | పెండ్లి కార్డులు పంచడానికి వెళ్తుండగా బైకును ఢీకొన్న ఆడి కారు.. ముగ్గురు మృతి