Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఒక బైకును ఢీకొనడంతో బైకుపై ఉన్న ముగ్గురు మరణించారు. మృతుల ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. రెండు వారాల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్, రేవా జిల్లా, కోస్తా గ్రామానికి చెందిన భగవత్ విశ్వకర్మ (55), అతడి కొడుకు శివం విశ్వకర్మ, వారి బంధువు శీతల్ విశ్వకర్మ ముగ్గురు తమ స్వగ్రామం నుంచి బైకుపై బయల్దేరారు. ఈ నెల 24న భగవత్ పెద్ద కొడుకు వివాహం జరగాల్సి ఉంది. దీంతో పెండ్లి ఆహ్వాన పత్రికలు పంచేందుకు బైకుపై వెళ్తుండగా ప్రయాగ్రాజ్ నుంచి వస్తున్న ఆడి కారు.. రేవా- ప్రయాగ్ రాజ్ హైవేపై వారి బైకును ఢీకొంది. కారు వేగంగా ఉండటంతో ఆ ముగ్గురు బైకు నుంచి ఎగిరిపోయి, డివైడర్ను ఢీకొన్నారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన వారి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే జరిగింది.
ఘటనలో కారు ముందు భాగంతోపాటు బైకు నుజ్జునుజ్జయింది. ఘటన జరిగిన వెంటనే ఆడి కారు డ్రైవర్ను స్థానికులు పట్టుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.