CV Anand : మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్యతో పాటు అండర్గ్రౌండ్లో ఉన్న సీనియర్ నాయకత్వం హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. కర్రెగుట్టల దండకారణ్యంలో సోమవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్భంగా మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కర్రెగుట్టల పర్యటనకు వచ్చిన డీజీపీ సీవీ ఆనంద్ పామునూరు బెటాలియన్ను దాటి చెలిమల, డోలి, తడపాల మీదుగా సుమారు 28 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారిని పరిశీలించారు. కర్రెగుటలలో శాశ్వత అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
డీజీపీ పర్యటన సాగిందిలా..
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కర్రేగుట్టల్లో ఆయన పర్యటించారు. ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్న డీజీపీ జిల్లాలోనే బస చేసి సోమవారం ఉదయం పామునూరు 39 సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. అక్కడి నుంచి కర్రేగుట్టల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన రహదారి పనులను పరిశీలించారు. అక్కడ పనుల్లో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పామునూరులో నివాసం ఉంటున్న గుత్తి కోయలకు బియ్యం, దుప్పట్లు అందజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మావోయిస్టుల అణచివేతలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేశామని తెలిపారు. మావోయిస్టుల కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయించామని, కొందరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన పునరావాస విధానాలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందించామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాంతం అరణ్య ప్రాంతమైనప్పటికీ అటవీశాఖతో కలిసి చూడదగ్గ ప్రదేశాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని డీజీపీ వెల్లడించారు.
లొంగియిన వారికి ప్రభుత్వం అండ
మావోయిస్టుల పునరావాసంలో తెలంగాణ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సరెండర్ అయిన వారికి ఆర్థిక సాయం, సామాజికంగా స్థిరపడేందుకు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి హామీ మేరకు ఉచిత వైద్య చికిత్స కోసం ఆరోగ్య రక్షణ కార్డులు జారీ చేసి పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సరెండర్ అయిన వారు గౌరవప్రదంగా జీవించేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డిజిపి తెలిపారు. వృత్తి లేదా వ్యాపారం చేయాలనుకునే వారికి శిక్షణతో పాటు రుణాలు అందించి స్వయం ఉపాధికి సహకరిస్తామన్నారు. ఆరోగ్య, కేసులు లేదా ఇతర సమస్యలు ఉంటే పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు. సరెండర్ అయిన వారిని పూర్తిగా జనజీవన స్రవంతిలో కలపడం పునరావాస విధానం లక్ష్యమన్నారు. పునరావాస విధానం కింద ఇప్పటికే 23 మంది సరెండర్ అయిన మావోయిస్టులకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించినట్లు డిజిపి తెలిపారు. సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, పార్టీ మెంబర్ లేదా ఇతర క్యాడర్ అనే తేడా లేకుండా సరెండర్ తర్వాత సాధారణ జీవితంలో స్థిరపడేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. 40 ఏళ్ల మావోయిస్టు జీవితం గడిపి, జనజీవన స్రవంతిలో కలిసిన సీనియర్ నాయకురాలు కాకర్ల సమత అలియాస్ మాధవికి ఆర్థిక సాయం అందించారు.