Election Code | మక్తల్, ఫిబ్రవరి 03 : మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా అభ్యర్థులు బీ ఫామ్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేస్తున్న క్రమంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ సంఘటన మంగళవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయం ముందు చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే.. మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన 16 వార్డులలో ఎన్నికల బరిలో నిలిచినటువంటి, అభ్యర్థులు బీ ఫామ్స్ అందజేయడం కోసం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బీ ఫామ్స్ అందజేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందే కాంగ్రెస్ నినాదాలు చేస్తూ కోడ్ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తరహాలోనే బీజేపీకి చెందిన నాయకులు, ఎన్నికల పోటీల్లో నిలిచినటువంటి అభ్యర్థులు సైతం బీజేపీ నినాదాలు చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా..
రెండు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, తమ పార్టీ అభ్యర్థులతోపాటు మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున రాజకీయ పార్టీ నినాదాలు చేస్తుంటే, వారిని నివారించాల్సిన మున్సిపల్ ఎన్నికల కార్యాలయ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడకపోవడం, తీవ్ర విమర్శలకు దారి తీసింది. బీఫామ్ అందజేయడానికి వచ్చిన అభ్యర్థితోపాటు, ఒకరిని అనుమతించాల్సి ఉండగా, ఇవేవీ పట్టించుకోకుండా ఒక్కసారిగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చి, అభ్యర్థుల వెంబడి కార్యాలయంలో గుమి కూడడంతోపాటు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, రాజకీయ పార్టీ స్లోగన్స్ చేస్తున్నా సరే నివారించడంలో మున్సిపల్ ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీన్నిబట్టి మున్సిపల్ ఎన్నికల అధికారులు సైతం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సంఘటనపై మున్సిపల్ కమిషనర్ శ్రీరాములును నమస్తే తెలంగాణ ప్రతినిధి వివరణ కోరగా.. మున్సిపల్ కార్యాలయం ముందు రాజకీయ పార్టీ నాయకుల స్లోగన్స్ చేయరాదని, స్లోగన్స్ చేసినవారు కోడ్ ఉల్లంఘనకు దారి తీసిన వారవుతారని తెలిపారు.
ఒకేసారి గుంపులు గుంపులాగా నాయకులు వచ్చి, కార్యాలయం ముందు స్లోగన్స్ చేసిన విషయాన్ని స్థానిక ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, పోలీసులు ఇతర బందోబస్తులో ఉన్నందువల్ల, మున్సిపల్ కార్యాలయం వద్ద తగిన రీతిలో బంధా బస్సులో ఏర్పాటు చేయడం లేదని, ఎస్ఐ తెలపడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నినాదాలు చేసిన వారిని గుర్తించి, ఎన్నికల నిబంధనల ప్రకారం గా, తగు చర్యలు చేపడతామని కమిషనర్ బదులిచ్చారు.

Jagthyal | జగిత్యాల మున్సిపల్ పోరులో జీవన్ రెడ్డి vs సంజయ్