Sircilla | సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 3 : బీజేపీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయితీ రోడ్డుకెక్కింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు. ఎనమిదేళ్లుగా పార్టీలో కష్టపడుతున్న తనకు మున్సిపల్ ఎన్నికల పోటీ చేసేందుకు బీ ఫామ్ ఇవ్వమంటే జిల్లా అధ్యక్షుడు గోపి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపించారు.
బీజేపీలో జిల్లా అధ్యక్షుడు చేస్తున్న అరాచకాలు అధిష్టానానికి తెలియకుండానే జరుగుతున్నాయని ప్రశ్నించారు. గత మున్సిపల్ ఎన్నికలలో భారీ ఓట్లతో గెలిచిన తనకు బీజేపీలో కనీసం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఎనిమిది ఓట్లు రాణి అభ్యర్థికి డబ్బులు తీసుకొని బీఫాం ఇచ్చారని ఆరోపించారు. పార్టీ కండువాలు నేలపై పడేసి అంబేద్కర్ విగ్రహానికి రాజీనామా పత్రం సమర్పించారు. ఆయన వెంట పదో వార్డు యువకులు తదితరులున్నారు.