– పతంజలి మహర్షి.
– నాన్న.
International Yoga Day | ఇంటి ఖర్చులు నిభాయించుకోడానికి నాన్న తలకిందులైపోయే సందర్భాలు లెక్కలేనన్ని. పతంజలిది అష్టాంగ యోగమైతే. నాన్నది అష్టకష్టాల యోగం. ఫాదర్స్ డే (జూన్ 18), ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21).. సందర్భంగా నాన్నలోని జీవనయోగ సాధకుడికి ప్రణామాలతో..
అవును. సందేహం లేదు. నాన్నలో ఒక అష్టాంగ యోగి ఉన్నాడు. యోగాసనాల్లో అంతర్లీంగా నాన్న తత్వం కనిపిస్తుంది.
రెండొందల పైచిలుకు యోగ భంగిమలన్నీ రోజువారీ జీవితంలో నాన్న చేసే విన్యాసాలే.
అపార సాధన తర్వాత లభించే స్థితప్రజ్ఞత.. నాన్నకు జీవితానుభవంతో అబ్బింది. ముక్కు మూసుకోకుండానే వచ్చేసింది.
చిత్తవృత్తి నిరోధం యోగా అంతిమ ప్రయోజనం. ఆ చంచలత్వాన్ని నాన్న ఎప్పుడో గెలిచారు.
అత్యున్నతమైన సమాధి స్థితికి చేరుకోవడానికి సాధకుడు అష్టాంగాలను ఆసరా చేసుకున్నట్టు..
కుటుంబాన్ని పోషించడానికి నాన్న అష్టకష్టాలకు అలవాటు పడ్డారు.
ఏటికేడాది పెరిగే బాధ్యతలు, నెలనెలా రెట్టింపు అయ్యే ఖర్చుల మధ్య భార్యాపిల్లలకు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకోవడం.. కుండలి జాగృతిని మించిన కష్టకార్యం. అయినా నాన్న ప్రయత్నిస్తూనే ఉంటాడు. విఫలం అవుతూనే ఉంటాడు. మళ్లీ ప్రయత్నిస్తాడు. మళ్లీ విఫలం అవుతాడు. ఎక్కడా విసుగు ఉండదు. విరామమూ తీసుకోడు. ఎందుకంటే, ‘బాప్ ఆఫ్ ఆల్ యోగాస్’గా కృష్ణ పరమాత్మ ప్రబోధించిన కర్మయోగ నాన్నకు కొట్టినపిండి. యోగ సాధకుడు శ్వాస మీద ధ్యాస పెడతాడు. నాన్న ధ్యాస మాత్రం కుటుంబం మీదే.
పూరక.. రేచక.. కుంభక.. పతంజలి యోగాలో ప్రాణత్రయమైతే. భార్య.. పిల్లలు.. కన్నవాళ్లు నాన్న పంచప్రాణాలు. కాబట్టే, నాన్న జీవితం ఓ యోగా విశ్వవిద్యాలయమంత విస్తారంగా అనిపిస్తుంది. ఆయన వేసే ప్రతి అడుగూ ఓ ఆసనంలానే తోస్తుంది. ఏ మధ్యాహ్నమో ఆయన కునుకుతీస్తున్నా.. శవాసనం వేస్తున్నంత ప్రశాంతగా ఉంటారు.
బతికినంతకాలం శరీరమూ మనసూ దృఢంగా ఉండాలన్నదే యోగా లక్ష్యం. ఊపిరి ఉన్నన్ని రోజులూ కుటుంబానికి అండగా నిలవాలన్నది నాన్న తపన. అందుకేనేమో, నాన్నను చూసిన ప్రతిసారీ వృక్షాసన భంగిమే గుర్తుకొస్తుంది. కుటుంబానికి నాన్న చెట్టంత అండ. కొడుకులూ కూతుళ్లూ కొమ్మలు. వంశ మూల పురుషులు తల్లి వేళ్లు. జీవిత భాగస్వామి కాండం. బంధుమిత్రులు ఆకులూ అలములూ. కాసే పండ్లు కర్మ ఫలాలు. పూసే పూలు శ్రమ ఫలితాలు. బాధించే కష్టాలు రాళ్ల దెబ్బలు. ఎదురయ్యే నష్టాలు చీడపీడలు. వృక్షాసనం కండరాలను గట్టిపరుస్తుంది. వెన్నెముకను
నిటారుగా నిలబెడుతుంది.
త్రికోణంలో మూడు కోణాలుంటాయి. నాన్న ఆర్థిక వ్యవహారాలకూ మూడు కోణాలే. జీతం, అప్పులు, వడ్డీలు. పంట డబ్బు చేతిలో పడగానే ఎన్నోకొన్ని అప్పులు తీరుస్తాడు. అంతలోనే జేబు ఖాళీ అయిపోతుంది. సేద్యానికి మళ్లీ అప్పులు చేస్తాడు. ఇంకో పంట రాగానే పాత అప్పులు తీర్చేస్తాడు. కొత్త అప్పులకు వడ్డీలు కడతాడు. బతికినన్నాళ్లూ ఆ త్రికోణం నుంచి బయటపడడు. పడలేడు కూడా. అంతకు మించి ఏం చేస్తాడు ఆ మధ్యతరగతి మనిషి? ఆ మూడుకోణాల ఊబి గురించి భార్యాపిల్లలకు తెలియకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటాడు. అప్పులోళ్లను స్నేహితులుగా పరిచయం చేస్తాడు. ఏదో ఒకరోజు అబద్ధం పాత నిలువుటద్దంలా బద్దలవుతుంది. బ్యాంకు నోటీసు రూపంలో నిజం తలుపు కొడుతుంది. ఆ ఒత్తిడిలో తలనొప్పి, నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె సమస్యలు..
నాన్నను కుంగదీస్తాయి. ఈ సమస్యలన్నిటికీ త్రికోణాసనంలో చక్కని పరిష్కారం ఉందని చెబుతారు యోగాచార్యులు.
వీరభద్రుడు శివుడి అంశం. దక్షయజ్ఞ సమయంలో పరమేశ్వరుడి క్రోధాగ్నిలోంచి ఉద్భవిస్తాడు. దక్షుడి అహంకారానికి ప్రతీక అయిన యజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. వీరభద్రాసన భంగిమలోనూ అంతే గాంభీర్యం కనిపిస్తుంది. ఆ మాటకొస్తే, మహాశాంతమూర్తి అయిన నాన్నలోనూ ఓ వీరభద్రుడు ఉంటాడు. ఎవరైనా తనకు నచ్చని పనులు చేస్తే అంతెత్తు ఎగిరిపడతాడు. కండ్లెర్ర జేస్తాడు. కోపంతో రంకెలేస్తాడు. ఇల్లాలు వణికి పోవాల్సిందే. పిల్లల వీపు విమానం మోతే. ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేసే సమయానికి ఆయన వంద వీరభద్రులను తలపించే రౌద్రమూర్తే. తన పిల్లలు చదువుతున్న బడిలో మరొకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తే తట్టుకోలేడు. తనకు ఇష్టమైన పుస్తకాలో, వస్తువులో స్థానభ్రంశం చెందితే సర్దుకుపోలేడు. ఆ ఉగ్రత్వం కూడా కొద్దిసేపే. మరుక్షణం ప్రేమ కురిపిస్తాడు. ఇదంతా ధర్మాగ్రహం. చదువుల పరుగులో పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అన్న భయం. క్రమశిక్షణ పెంపొందించే ప్రయత్నం. బాధ్యతల బరువు వల్ల వచ్చిన అధిక రక్తపోటు ప్రభావమైనా కూడా కావచ్చు. ఈ సమస్యకు వీరభద్రాసనంలో పరిష్కారం ఉందని నాన్నకు ఎవరైనా చెబితే బావుండు.
నాన్న నిఖార్సయిన వజ్రం. ఆయనకు తెలియని పురాణం లేదు. ఆయన ప్రస్తావించని ఉపనిషత్తులు లేవు. నాన్న నాలుక మీద చదువుల తల్లి బాసింపట్టు వేసుకుని కూర్చుందేమో. షేక్స్పియర్ నుంచి సాల్మన్ రష్డీ వరకు నాన్న చదవని రచయితలు లేరు. జాతీయ అంతర్జాతీయ పరిణామాల పట్ల లోతైన పరిజ్ఞానం ఆయన సొంతం. అలా అని ఆయనేం ఆక్స్ఫర్డ్లో చదువుకోలేదు. ఉన్న ఊళ్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకే వెళ్లాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పొలిమేర దాటలేక పోయాడు. కానీ ఆయన ఆలోచనా ప్రపంచం విస్తారమైంది. నాన్న నిఖార్సయిన ముడి వజ్రం. ఎవరో ఒకరు పూనుకుని సానబట్టి ఉంటే ఎక్కడో ఉండేవాడు. అయినా, ఇప్పటికి మాత్రం ఆయనకేం తక్కువ? రాజయోగమే. మహామహా సర్పంచులు కూడా సలహా కోసం వస్తారు. అంతటి పరిణతి సాధించాలంటే.. మనబోటి వాళ్లు వజ్రాసనం వేయాల్సిందే అని సూచిస్తారు యోగా గురువులు. దీనివల్ల మానసిక, శారీరక వ్యవస్థలు బలపడతాయి. ఇక్కడే తులాసనం గురించీ ప్రస్తావించుకోవాలి. తుల అంటే త్రాసు. నాన్న మాటతీరు తూకమేసినట్టే ఉంటుంది. ఎంత మాట్లాడాలో అంతే. పదాల ఎంపికలోనూ అదే సమతౌల్యం. ఎవరైనా సరే తొలి పరిచయంలోనే ఆయన అభిమానులైపోవాల్సిందే. కష్టనష్టాలు, సుఖదుఃఖాలు, ఆనంద విషాదాల్లోనూ మనం సమతౌల్యాన్ని కోల్పోకూడదు. మంచిచెడుల విచక్షణ మరిచిపోకూడదు. త్రాసులో సకలసంపదలూ ఒకవైపు.. నాన్న ఒక్కడూ ఒకవైపూ ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వ సంపద ముందు ఐష్టెశ్వరాలూ తేలిపోవాల్సిందే. తూకమేసింత కచ్చితంగా బతకడం ఎంత కష్టమో, తులాసనం వేయడమూ అంతే కష్టం. దీనివల్ల మోకాళ్లలో, చీలమండలలో గట్టిదనం వస్తుంది. ముఖ్యమైన కండరాలు బలోపేతం అవుతాయి. అన్నట్టు, యోగాలో హనుమదాసనమూ ఒకటుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి హనుమంతుడి గురించి చెప్పిన పోలికలన్నీ నాన్నకూ వర్తిస్తాయి. వాక్య కోవిద (మాటల్లో నేర్పరి), అమేయాత్మా (అపరిమిత ప్రజ్ఞ కలిగినవాడు), సంస్కార సంపన్నః (ఉత్తమ సంస్కారి).. హనుమన్న తర్వాత నాన్నే!
ఉష్ట్రం అంటే.. ఒంటె. ఎడారి ఓడను తలపించే భంగిమ ఉష్ట్రాసనం. ఈ ఆసనాన్ని సాధన చేస్తే నడుము నొప్పి, శ్వాసలో ఇబ్బందులు, కీళ్ల నొప్పులు, సయాటికా, గ్యాస్ట్రిక్ బాధలు తొలగిపోతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. భుజాలకు, వీపునకు బలం. యోగాసనాల్లో ఉష్ర్టాసనం గురించి చదివినా, ఎవరైనా ఆ ఆసనం వేస్తున్నా.. నాన్న గుర్తుకొచ్చి తీరతాడు. జీవితమనే ఎడారిలో ఆయన ఒంటెలాంటి బహుదూరపు బాటసారి. ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం. ఆ ప్రయాణం అతి సామాన్యంగా మొదలైంది. ఆస్తిపాస్తుల్లేవు. ఆదుకునేవాళ్లు లేరు. బలగమూ అంత పెద్దదేం కాదు. పైసా పైసా కూడబెట్టి, ఒక్కో ఇటుకా పేర్చి జీవన సౌధాన్ని నిర్మించుకున్నాడు. ఉన్న రోజు తిన్నాడు. లేనిరోజు పస్తులున్నాడు. ఒంట్లో నిల్వ ఉన్న కొద్దిపాటి నీళ్లనే జాగ్రత్తగా వాడుకుంటూ.. రోజుల తరబడి బతికేయగలదు ఒంటె. నాన్నకూ ఆ విద్య తెలుసు. నిండుకున్న పర్సుతోనే.. నిండుకుండలా నెలంతా లాక్కొచ్చిన రోజులు అనేకం. అయినా, ఆయన మొహంలో చిరునవ్వు చెదరదు. నాన్న నిండుగా నవ్వితే పద్మం గుర్తుకొస్తుంది. పద్మాసన భంగిమలో ఉన్నప్పుడు కూడా పెదాలపై చిరుచిరు నగవులు కదలాడాలని యోగాచార్యులు చెబుతుంటారు.
తనదీ అనుకున్న ఆస్తిని దాయాదులు తన్నుకుపోతారు. గుడ్డిగా నమ్మిన వ్యాపార భాగస్వాములు నిండా ముంచేస్తారు. రావాల్సిన ప్రమోషన్ వెనక్కి వెళ్లిపోతుంది. పరిస్థితులతో పాటు జీవితమూ తలకిందులైపోయిన ఘట్టాలు నాన్న అనుభవాల్లో అనేకం. అలాంటి నాన్నకు శీర్షాసనం ఒక లెక్కా? తలకిందులుగా నిలబడటం కొత్తా? అరకొర జీతంతో సంసారం నడిపించినవాడికి, అంతంతమాత్రం సంపాదనతో పిల్లల్ని పెద్ద చదువులు చదివించినవాడికి.. ఓ దశలో అంచనాలు తలకిందులై అన్నీ కోల్పోవాల్సిన పరిస్థితికి చేరుకున్న వాడికి శీర్షాసనం అతి సులభాసనం. గోడలా అమ్మ ఆసరాగా నిలిచిన సందర్భాలు ఉన్నా.. మొత్తంగా ఒంటరి పోరాటమే. ప్రతి సవాలూ మనిషిని మరింత బలోపేతం చేసినట్టు.. శీర్షాసనం సాధకులను శక్తివంతులను చేస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. ఊపిరితిత్తులకు కొత్త బలం వస్తుంది. జ్ఞాపకశక్తి అధికం అవుతుంది.
నాగలిపట్టిన ప్రతిరైతూ నా కళ్లకు శిలువ మోస్తున్న క్రీస్తులా కనిపిస్తాడు.. అంటాడో కవి. నాగలి ఎత్తిన ప్రతిభుజం అప్పులనూ మోస్తుంది. రుతుపవనాల దాగుడుమూతలాటలో ప్రతిసారీ రైతన్నదే ఓటమి. ఆ నష్టాల సాగు చెట్టంత నాన్ననూ కుంగదీసిన సందర్భాలు అనేకం. అయినా ఆయన హలాన్ని వదలడు. పొలాన్ని వీడడు. అదీ పట్టుదల. పట్టుదలను మించిన ప్రేమ. హలం ధరించినప్పుడే కాదు, హలాసనం వేసినప్పుడూ.. వెన్నెముక నిటారుగానే ఉంటుందని యోగా గురువులు చెబుతారు. ఆ ప్రభావంతో థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అవుతుందట. హలాసనం వేయకపోతే, యోగాసన ప్రక్రియ పరిపూర్ణం కానేకాదు. సేద్యాన్ని విడిచిపెట్టిన రోజున రైతు నీటిలోంచి ఒడ్డున పడిన చేపపిల్లే అవుతాడు. అందుకే, లాభమొచ్చినా నష్టమొచ్చినా.. మట్టితో చుట్టరికాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు నాన్న. ఆరు నూరైనా పల్లె పొలిమేర దాటాలనుకోడు. అది ఆయన అస్తిత్వం. సత్తువ కరిగినా, స్తోమత తగ్గినా హలాన్ని దించుకోడానికి మాత్రం సిద్ధపడడు. కొన్ని బరువులు సంతోషాన్నిస్తాయి. కొన్ని బాధ్యతలు పరిపూర్ణత్వాన్నిస్తాయి. కాబట్టే నాన్న.. పంచెకట్టులో ఉన్న పతంజలి మహర్షిలా అనిపిస్తారు.
ఓం సర్వే భవన్తు సుఖినః సర్వే సన్తు నిరామయాః
.. అందరూ సంతోషంగా ఉండాలి.
సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలి.
అందులో నాన్నా ఉండాలి.
యోగాలోని ఎనిమిది విభాగాలను కలిపి అష్టాంగ యోగం అంటారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి ఎనిమిది నిచ్చెనలివి.
యమ: చెడు ఆలోచనలను, ప్రేరణలను నియంత్రించడం.
నియమ: మంచి అలవాట్లను అలవరుచుకోవడం.
ఆసన: దీర్ఘకాల ధ్యానానికి అవసరమైన భంగిమలను నేర్చుకోవడం. ఇవే యోగాసనాలు.
ప్రాణాయామం: శ్వాస మీద పట్టు సాధించడం.
ప్రత్యాహారం: మోహాల నుంచి మనసును మళ్లించడం.
ధారణ: ధ్యాన కేంద్రంపై మనసు లగ్నం చేయడం.
ధ్యానం: ఏకాగ్రచిత్తం సాధించడం.
సమాధి: శరీరాన్ని గెలిచిన స్థితి. మనసును అధీనంలోకి తెచ్చుకున్న మహోన్నత స్థితి.
యోగాసనాలు వేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి.
➣ వదులైన దుస్తులే ధరించాలి.
➣ మిట్ట మధ్యాహ్నం యోగా మంచిది కాదు.
➣ ఖాళీ కడుపుతో సాధన వద్దు.
➣ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతే మొదలుపెట్టాలి.
➣ నెలసరి సమయంలో నిషిద్ధం.
➣ గర్భిణులు నిపుణుల అనుమతితోనే చేయాలి.
➣ మాటలు వద్దు.
➣ భోజనం తర్వాత మూడు గంటల వ్యవధి ఉండాలి.
➣ శుభ్రమైన ప్రదేశంలోనే సాధన చేయాలి.
➣ శరీరంపై ఒత్తిడి వద్దు.
➣ చివరలో శవాసనంలో రిలాక్స్ కావాలి.
ఉరుకులు పరుగుల జీవనశైలి, స్మార్ట్ఫోన్లు, టీవీ సీరియళ్లు, సినిమాలు, అర్ధరాత్రి ఉద్యోగాలు, ఒత్తిళ్లు మొదలైన వాటివల్ల కంటికి కునుకు కరువైనవాళ్లు చాలామందే. గుండె, కిడ్నీల వ్యాధులు, బీపీ, డయాబెటిస్, ఊబకాయం, కుంగుబాటు లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు నిద్రలేమితో సంబంధం ఉంది. మంచి నిద్రకు యోగశాస్త్రంలో మేలైన మార్గాలు ఉన్నాయి. భ్రామరి ప్రాణాయామం, మకరాసనం, అనులోమ విలోమ శ్వాస, బాలాసనం, శవాసనాలతో రోజువారీ జీవితంలో ఒత్తిళ్లను దూరం చేసుకుని, సుఖనిద్రను సొంతం చేసుకోవచ్చు. మరుసటి రోజును ఉత్సాహంగా ప్రారంభించొచ్చు.
ఇది మనసు, నరాల వ్యవస్థకు ఉపశమనం చేకూర్చే శ్వాసకు సంబంధించిన వ్యాయామం. ఒత్తిడి నుంచి ఉపశమనానికి మంచి సాధనం ప్రాణాయామం. ఇందులో భాగంగా చేసే ఝంకారం వల్ల వచ్చే ప్రకంపనలు ఆనందం, ఆరోగ్యాన్ని ప్రసాదించే న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరటోనిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. భ్రామరి ప్రాణాయామం ఆందోళన, నిద్రలేమి, కుంగుబాటును తరిమికొడుతుంది.
ముఖానికి దిగువన చేతులను ఉంచుకుని, పొట్టమీదుగా పడుకునే భంగిమ మకరాసనం. ముఖాన్ని చేతుల మణికట్టు మీద ఉంచాలి. కాళ్లను విశ్రాంతిగా ఉంచి మడమలను ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా పాదాలను బయటికి పెట్టాలి. కళ్లు మూసుకుని ఒత్తిడిని వదిలించుకోవడం మీద దృష్టిపెట్టాలి. గాఢంగా శ్వాసించాలి.
ఇలా చేయడం నాడీ వ్యవస్థ మీద సానుకూల ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అధిక రక్తపోటు లాంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనికోసం సుఖాసనంలో కూర్చోవాలి. ముక్కు కుడిభాగాన్ని బొటనవేలితో మూసి, ఎడమ వైపునుంచి గాలిని పీల్చుకోవాలి. కొంచెం సేపు అలాగే ఉంచి ఎడమ భాగాన్ని బొటనవేలితో మూసేయాలి. కుడి వైపునుంచి గాలిని బయటికి వదలిపెట్టాలి. ఆ తర్వాత కూడా ఉచ్ఛాస నిశ్వాసలను ఇదే పద్ధతిలో కొనసాగించాలి. గాలి బయటికి వదిలే వ్యవధి, పీల్చే వ్యవధి కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇలా పది రౌండ్లు చేయాలి.
మోకరిల్లి వేసే బాలాసనంతో ఎన్నో శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. వీపు కింది భాగాన్ని సాగదీస్తూ, మిగిలిన శరీరాన్ని విశ్రాంతి స్థితిలో ఉంచుతూ ఈ ఆసనం వేస్తారు. బాలాసనం కోసం పిరుదులను మడమల మీద ఉంచాలి. శ్వాసను వదులుతూ శరీరాన్ని ముందుకు సాగదీయాలి. నుదురు మ్యాట్మీద కుదురుగా ఉండేలా చూసుకుంటూ, రెండు చేతుల్ని ముందుకు చాచి, అలాగే ఉంచాలి. దీంతో భుజాలు, పిరుదులు, వెన్నెముక, చేతులు సాగదీసిన అనుభూతి కలుగుతుంది. ఒత్తిడిని పారదోలి, మనసును ప్రశాంతం చేసుకునేందుకు బాలాసనం గొప్ప ఉపకరణం.
ఇది నాడీ వ్యవస్థకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆందోళనను, ఒత్తిడిని అదుపుచేస్తుంది. శరీరం, మనసుకు విశ్రాంతిని ఇస్తుంది. ఈ ఆసనం కోసం.. కండ్లు మూసుకుని వెల్లకిలా పడుకోవాలి. మనసులోకి ఎలాంటి ఆలోచనలూ రాకుండా చూసుకోవాలి. శ్వాస మీద ధ్యాసపెట్టాలి. శరీరం పూర్తి విశ్రాంతి తీసుకుని, పునరుత్తేజం చెందేలా శవాసనంలో ఓ ఐదు నిమిషాలపాటు ఉండిపోవాలి.
“Health Tips | సూర్య నమస్కారాలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు”