మంచిర్యాల : జిల్లాలోని బెల్లంపల్లి బీసీ బాలిక గురుకుల పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్( Human Rights) సుమోటో (Suo motu ) గా స్వీకరించింది. నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికలో గురువారం వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించి సమగ్ర నివేదికను సమర్పించాలని జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఉన్న కమిషన్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఆగస్టు 25వ తేదీలోగా సమగ్ర నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది.
గురుకుల పాఠశాలలో 540 మంది విద్యార్థినులు ఐదు నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఉడకబెట్టిన బఠానీలను అల్పాహారంగా తీసుకున్నారు. రాత్రి అన్నం, సోరకాయ కూర, పప్పుతో భోజనం చేశారు. అనంతరం 30 మంది విద్యార్థినులు కడుపువొప్పి, వికారం అవుతుందని వాంతులు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని స్థానిక వంద పడకల దవాఖానకి తరలించారు. చికిత్స అనంతరం కొంత మంది విద్యార్థినులను పాఠశాలకు తీసుకొచ్చారు.
గురువారం ఉదయం కూడా మరి కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని కూడా దవాఖానకు తరలించారు. తక్కువ వాంతులు అవుతున్న విద్యార్థినులతోపాటు అలసటగా ఉన్న వారిని షంషీర్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది గురుకుల పాఠశాలలోనే చికిత్స అందించారు.
పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురిని జిల్లా ఏరియా దవాఖానకు తరలించారు. సాయంత్రం స్నాక్స్లో భాగంగా బఠానీలతో కూడిన అల్పాహారాన్ని ఇవ్వడంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తున్నది. బఠానీలను సరిగా ఉడికించపోవడం, పరిశుభ్రత పాటించకపోవడంతోనే అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరుగుతున్నది.