Shravana | మంచి శ్రోత అయినవాడు గొప్ప వక్త అవుతాడని అంటారు. వినగలిగితేనే మాట వస్తుందనే పెద్దల సూచనను డాక్టర్లు కూడా సమర్థిస్తున్నారు. మరి వినలేకపోతే? మాట్లాడలేరు. అలాంటి పిల్లల చెవికి వినికిడి యంత్రాన్ని తొడిగి శబ్దాల నుంచి పదాలు, భాష దాకా నేర్పించే సంస్థ ఇది. ‘శ్రవణ’ దీనిపేరు. మాటలురాని పిల్లల్ని మాట్లాడించడమే దీని లక్ష్యం. పైసా తీసుకోకుండా సేవ చేయడమే ఈ సంస్థ గొప్పదనం.
పూలతోట ఎంత అందంగా ఉంటుందో.. ‘శ్రవణ’ కూడా చిన్నారుల నవ్వులతో అంతే అందంగా కనిపిస్తుంది. సెలయేటి సవ్వడిలాంటి నవ్వుల్ని పర్యవేక్షిస్తూ ఇక్కడో పెద్దాయన ఉంటారు. ఆయన వయసు తొంభై సంవత్సరాలకు ఒక్క ఏడాది తక్కువ! శరీరానికి వృద్ధాప్యం వచ్చినా, మనసు ఇంకా యవ్వనం తొణికిసలాడుతున్నది.. లేత మొగ్గల్లాంటి ఆ పిల్లలతో చేతులు కలుపుతూ, పాలబుగ్గలకు ముద్దులిస్తూ అందరినీ ఆడిస్తూ ఉండే ఆ తాతయ్య పేరు కుమారస్వామి రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా చేశారు.
మాటల బడి ‘ఉన్నంతకాలం ఏదో ఒకటి చేయాలి. నలుగురికి ఉపయోగపడాలి’ అంటున్నారు కుమారస్వామి రెడ్డి. ‘ఇది మాటలు రాని పిల్లలకు మాటలు నేర్పే బడి. పిల్లలతోపాటు తల్లులకూ చదువు చెబుతాం. ఎందుకంటే?.. వీళ్లంతా వినికిడి సమస్య ఉన్న పిల్లలు. ఇప్పుడు కానీ నేర్పకపోతే చేయిదాటిపోయినట్టే. వినికిడి సమస్య ఉంటే అయిదేళ్ల లోపే పసిగట్టి వాళ్లకు స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ థెరపీ చేయాలి. ఆ తర్వాత హియరింగ్ ఎయిడ్స్ పెట్టినా మాటలు రావు. ఎదుటివారి మాటలు అర్థం కావు. చెవిలో మెషీన్ పెట్టి పిల్లల్ని వదిలేయకుండా వాళ్లకు మాటలు నేర్పి.. బడికి వెళ్లేలా చేస్తున్నాం’ అంటూ ‘శ్రవణం’ గురించి చెబుతారు కుమారస్వామి రెడ్డి.
వినికిడి సమస్య ఉన్న చాలా మందికి మాటలు రావు. మూగవారుగానే మిగిలిపోతారు. కారణం.. వినికిడి సమస్యను గుర్తించి చెవిలో మెషిన్ పెట్టినంత మాత్రాన వాళ్లకు మాటలు రావు. అయిదేళ్లలోపు సమస్యను గుర్తించి, చెవిలో హియరింగ్ ఎయిడ్ పెట్టిన తర్వాత రెండేళ్లపాటు ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. శిక్షణ లేకపోతే వినికిడికి సంబంధించిన నరాలు నిస్తేజం అవుతాయి. వాటిని ప్రేరేపించేందుకు సౌండ్ థెరపీ చేయాలి. శబ్దాలను పలికించాలి. ఆ శబ్దాలను పదాలుగా మలచాలి. పదాలతో మాటలల్లాలి. ఇదే లాంగ్వేజ్ థెరపీ. ఈ విషయం తెలియక ఎంతోమంది తల్లిదండ్రులు నష్టపోతున్నారు.
తెలిసినా తగిన సౌకర్యాలు లేక పిల్లలు నష్టపోతున్నారు. ఇలాంటి పిల్లలను మౌన సముద్రం నుంచి మాటల తీరం చేర్చడం కోసం వినికిడి లోపం ఉన్న బాలలకు శిక్షణా కేంద్రం స్థాపించాలని డాక్టర్ పోతుల విజయ్బాబు అనుకున్నారు. ఇంగ్లండ్లో హెడ్ అండ్ నెక్ సర్జన్గా పనిచేస్తున్న ఆయన గాంధీ మెడికల్ కాలేజ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు 2005లో హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో తన ఫ్రెండ్ బిడ్డను వెంటబెట్టుకుని వచ్చారు. ఆమెకు చిన్నప్పటి నుంచి వినికిడి సమస్య ఉంది. హియరింగ్ ఎయిడ్స్ సరిగా ఉపయోగించలేదు. సరైన వైద్య సహాయం అందలేదు. అందువల్ల ఆమె జీవితం మౌనమైపోయింది. ఆ సంఘటన ఆయన్ను ప్రేరేపించింది. అవకాశాలు ఉండీ నష్టపోతున్న వాళ్లను కాపాడాలని తన స్నేహితులు… డాక్టర్ మహ్మద్ ఇజాజ్ హుస్సేన్, సూర్యకాంత్ (వ్యాపారవేత్త), దేచు బెనర్జీ (సామాజిక కార్యకర్త)తో కలిసి ‘శ్రవణ’ను ప్రారంభించాలని అనుకున్నారు.
సంస్థ కోసం వినికిడి పరీక్ష పరికరాలు, సౌండ్ ప్రూఫ్ ల్యాబ్, స్పీచ్ థెరపీ పరికరాలకు కోటి రూపాయలు అవుతాయని అంచనా వేశారు. ఇజాజ్ హుస్సేన్ తన ఇంటిని అద్దె లేకుండా సంస్థకు అప్పగించారు. మిగతావాళ్లు విరాళాలు సేకరించారు. అలా ఎనిమిది లక్షల రూపాయలు సమకూరాయి. కొన్ని సంస్థలు పరికరాలను ఉచితంగా ఇచ్చాయి. అందరి సహకారంతో 2006లో శ్రవణ చిల్డ్రన్ డెఫ్నెస్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభమైంది. హాస్పిటల్లో పుట్టిన పిల్లల్లో వినికిడి సమస్యను పరీక్షించడం, గ్రామాలు, పట్టణాల్లో ఉండే పిల్లలకు స్క్రీనింగ్ చేయడం మొదలుపెట్టారు. వినికిడి లోపాన్ని సరిచేసేందుకు ‘శ్రవణ’ తరఫునే హియరింగ్ ఎయిడ్స్ ఉచితంగా అందించారు. కొన్నాళ్ల ప్రయాణంలో శోభారాణి (సోషల్ వర్కర్) ఈ నలుగురితో చేయి కలిపారు. వీళ్లంతా హైదరాబాద్కు దూరంగా ఉన్నప్పటికీ అవసరమైన నిధులు సమకూరుస్తూ సంస్థను నడుపుతున్నారు. తమ కర్తవ్యానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారస్వామి రెడ్డి సాయం కోరారు. ఆయన కాదనకుండా శ్రవణ నిర్వహణను భుజానికెత్తుకుని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. అంతేకాదు తనవంతుగా విరాళాలూ సేకరించారు. పదకొండేళ్ల నుంచి సంస్థకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో లక్షలాది మందికి స్క్రీనింగ్ చేసింది శ్రవణం. రెండువేల మందిలో వినికిడి సమస్యల్ని గుర్తించారు. వాళ్లకు హైదరాబాద్లో వినికిడి తీవ్రతను నిర్ధారించే పరీక్షలు మొదలుపెట్టారు.
…? నాగవర్ధన్ రాయల
“Daily labour App | క్యాబ్ల కోసమే కాదు లేబర్స్ కోసమూ ఓ యాప్.. క్రియేట్ చేసిన జనగామ బిడ్డ”
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”