persons of the year 2022 | ఒక ఏడాది గడిచిపోతుంది. కొన్ని విజయాలూ, కొన్ని అపజయాలూ చరిత్రలో భాగమవుతాయి. విజేతలను సమాజం గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ల పేర్లు పత్రికల పతాక శీర్షికల్లో కనిపిస్తాయి. అలా టైమ్, సీఎన్ఎన్లాంటి వివిధ మీడియా సంస్థల ద్వారా ఈ ఏటి మేటి వ్యక్తులుగా ఎన్నికయ్యారు కొందరు. వాళ్లెవరో, ఏం సాధించారో తెలుసుకుందాం రండి! ఆ విజేతల పోరాట పటిమను, ఆ సహృదయుల మానవతా గుణాన్ని గుర్తుచేసుకుందాం రండి!
‘టైమ్’ పత్రిక ప్రతి ఏడాదీ ఓ మేటి వ్యక్తిని ఎంపిక చేస్తుంది. 2022 సంవత్సరానికి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ నిలిచారు. ఈ సందర్భంగా పత్రిక తన కవర్ పేజీ మీద జెలెన్స్కీ చిత్రాన్ని ముద్రించింది. ‘ద స్పిరిట్ ఆఫ్ ఉక్రెయిన్’ అంటూ ఆ దేశపు ఆత్మగా స్కీని అభివర్ణించింది. టీవీ షోలో కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన రాజకీయాల్లో ప్రవేశించి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటోలో ఉక్రెయిన్ చేరిక విషయంలో రష్యాతో ఉన్న విభేదాలు యుద్ధానికి దారితీశాయి. అంత పెద్దదేశంతో ఉక్రెయిన్ పోరాడుతున్న తీరు ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండటంతో, ప్రజల్లో కలిసిపోయి తానుకూడా తుపాకీ పట్టి రంగంలోకి దిగాడు జెలెన్స్కీ. ఈ పరిణామాలన్నీ జెలెన్స్కీకి విశ్వవేదిక మీద ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
సీఎన్ఎన్- న్యూస్18 వార్తా సంస్థలు సంయుక్తంగా ఈ సంవత్సరపు మేటి వ్యక్తులుగా వివిధ రంగాలకు చెందినవారికి పురస్కారాలు అందజేశాయి. ప్రజల ఓట్ల ఆధారంగా ఆ ఎంపిక జరిగింది. అందులో భాగంగా గత ఒలింపిక్స్లో పసిడి పతకాన్ని సాధించి భారత దేశాన్ని గర్వపడేలా చేసిన క్రీడాకారుడు నీరజ్చోప్రా స్పోర్ట్స్ విభాగంలో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు. జావెలిన్త్రోలో బంగారు పతకాన్ని తెచ్చిపెట్టిన ఈ 24 ఏండ్ల కుర్రాడు భారత్ తరఫున ఒలింపిక్స్లో ఈ పతకం సాధించిన అతి పిన్న వయస్కుడు. అంతేకాదు, పాల్గొన్న తొలి ఒలింపిక్స్లోనే పతకాన్ని కొల్లగొట్టిన మొట్టమొదటి భారతీయుడు. ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ.. తనలాంటి క్రీడాకారులకు మైదానంలో సాధనే ధ్యానంతో సమానమని చెప్పాడు. తాము రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు అక్కడే కష్టపడతామని అన్నాడు. ‘మనం సాధించగలమన్న విషయాన్ని ప్రపంచంలో ఎవరూ నమ్మక ముందే మనం నమ్మాలి. మన లక్ష్య సాధన దిశగా కష్టపడాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం’ అంటూ తన పతకాల వెనుక ఉన్న శ్రమ గురించి చెప్పాడు.
ఎంటర్టైన్మెంట్ రంగంలో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప చిత్రంలో నటనకుగాను ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసిన తర్వాత ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడంలోనూ ఈ సినిమా విజయవంతమైంది. 2021లో విడుదలైన ‘పుష్ప’ సుమారు 350 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక్క దక్షిణాదినే కాదు ఉత్తరాదినీ ఓ ఊపు ఊపింది. అల్లు అర్జున్ను ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గానూ నిలబెట్టింది. ఇరవై సంవత్సరాల నుంచీ పరిశ్రమలో పనిచేస్తున్న తాను దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నాననీ, తొలిసారి ఉత్తరాది నుంచి అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందనీ ఈ సందర్భంగా ప్రకటించాడు బన్నీ.
సమాజానికి మేలు చేయాలన్న తపన చాలామందిలో ఉంటుంది. దానికి కార్యరూపం ఇచ్చేవాళ్లు మాత్రం చాలా తక్కువే. ఆ ఒక్కరి ముందడుగు చుట్టుపక్కల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అలాంటి సామాజిక మార్పు విభాగంలో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు కర్ణాటకకు చెందిన డాక్టర్ శంకర్ గౌడ. మాండ్య ప్రాంతంలో ఐదు రూపాయల వైద్యుడిగా ఆయనకు పేరుంది. ఈ చర్మవ్యాధి నిపుణుడు ఫీజుగా ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటాడు. మందులు కూడా చాలా చవకైనవే రాస్తాడు. వైద్యం చేశాడంటే ఇక తిరుగులేదు. కాబట్టే, పేద ప్రజలు తండోపతండాలుగా ఆయన దగ్గరికి వస్తుంటారు. చదువు పూర్తయిన వెంటనే.. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందని గ్రహించాననీ, అందుకే ఇక్కడ ఆసుపత్రి నెలకొల్పాననీ, తాను నేర్చుకున్న ప్రతి విషయాన్నీ ప్రజల బాగుకోసం ఉపయోగించాలని అనుకుంటాననీ చెబుతాడు శంకర్.
కరోనా సమయంలో సినీ నటుడు సోనూసూద్ ప్రజలకు ఎంతో సేవచేశాడు. ఆ మానవతకు గుర్తింపుగా ప్రత్యేక సాఫల్య పురస్కారం వరించింది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ సమాజం గురించి ఆయన ఆలోచించిన విధానం, స్పందించిన తీరు.. అందర్నీ కట్టిపడేశాయి. ఈ సందర్భంగా సోనూసూద్ తన తల్లి మాటలను గుర్తు చేసుకుంటూ.. ‘నీ చేయి సాయం చేయడానికే ఉపయోగపడాలి. ఇతరుల జీవితాలు నీ ద్వారా బాగుపడాలి’ అన్నాడు. ‘జీవితంలో అత్యంత ప్రధానమైన పాత్రను ఇప్పుడు నేను పోషిస్తున్నాను. ఈ సినిమాకు ముగింపు ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా’.. అంటూ ముక్తాయించాడు.
సాఫ్ట్వేర్ సంస్థలకు టూల్స్ను, టెక్నికల్ సపోర్ట్ను అందించే జోహో సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు, టోనీ థామస్లు ఈ ఏడాది స్టార్టప్ విభాగంలో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. తమిళనాడులోని మధ్య తరగతి కుంటుంబంలో పుట్టి పెరిగిన శ్రీధర్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే జోహోను స్థాపించాడు. ఐటీ రంగంలో ఎంతో పేరు సంపాదించాడు. తర్వాత భారత్కు తిరిగివచ్చి తమిళనాడు తెన్కాశీ జిల్లాలో వివిధ గ్రామాల్లో తన కార్యాలయాల్ని ప్రారంభించాడు. సాఫ్ట్వేర్కు సంబంధించిన వొకేషనల్ కోర్సులు బోధించేందుకు శిక్షణ కేంద్రాలు నెలకొల్పాడు. విశ్వవిద్యాలయ పట్టాలు లేని యువతీ యువకులను తమ సంస్థలో ఇంజినీర్లుగా చేర్చుకున్నాడు. జోహోలో పనిచేస్తున్న వాళ్లలో 15 నుంచి 20 శాతం గ్రామీణులే. ఈ సంస్థ పాఠశాలలనూ నిర్వహిస్తున్నది. ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ…‘వ్యాపారం అనేది నమ్మకంతో కూడిన వ్యవహారం. నెమ్మదిగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. భారత్లో చాలా ప్రతిభ ఉంది. ప్రపంచ విశ్వాసాన్ని పొందితేనే అన్ని దేశాలకంటే ముందంజలో ఉండగలం’ అంటాడు శ్రీధర్.
ప్రపంచ స్టార్టప్లను, ఇన్వెస్టర్లను కలిపే వేదిక .. టై (ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్) ఇటీవల హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఇందులో భాగంగా అడోబ్ సిస్టమ్స్ చైర్మన్, సీఈఓ శంతను నారాయణన్కు ‘సీఈఓ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం చేశారు. అడోబ్ ఫొటోషాప్, యాక్రోబాట్ రీడర్, క్రియేటివ్ క్లౌడ్ తదితర సర్వీసుల్ని అందజేసే ఈ సంస్థ మనందరికీ సుపరిచితమే. హైదరాబాద్లో పెరిగిన శంతను నారాయణన్ మాట్లాడుతూ, ఇక్కడివారితో ‘మనోడు’ అనిపించుకోవడం ఎంతో ఇష్టమని అన్నారు. నవతరం ఆంత్రప్రెన్యూర్లు గొప్పగొప్ప కలలు కనాలనీ, కొత్తగా వస్తున్న టెక్నాలజీని వారధిగా చేసుకుని విజయం సాధించాలనీ పిలుపునిచ్చారు. ఈ సమయంలో మాత్రమే ఆంత్రప్రెన్యూర్ అవ్వాలన్న నియమం ఏం ఉండదనీ, సంక్షోభాలనూ అవకాశాలుగా మార్చుకుంటేనే ఎదుగుదల సాధ్యమవుతుందనీ చెప్పారు. పదిహేనేళ్ల క్రితం సాఫ్ట్వేర్ సంక్షోభం వచ్చినప్పుడు అడోబ్ సంస్థ సబ్ స్క్రిప్షన్ మోడల్కు వెళ్లడంతో నిలదొక్కుకోగలిగిందనీ, అలాగే ఎవరైనా పరిస్థితుల్ని బట్టి మార్పులూ చేర్పులూ చేసుకుంటే విజయం సాధించవచ్చనీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్య రంగాల్లో ఉన్న మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొత్తతరానికి మార్గనిర్దేశనం చేశారు.
Read More :
“Suresh Raina | టాలెంట్ మాత్రమే సరిపోదు.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన సురేశ్ రైనా”